- నీట్ పీజీ కౌన్సెలింగ్ ఆలస్యాన్ని నిరసిస్తూ జూడాల నిర్ణయం
పద్మారావునగర్, వెలుగు: దేశవ్యాప్తంగా నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రాసెస్లో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో ఓపీడీ (ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్) సేవలను మూడు రోజులు బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ జూనియర్ (రెసిడెంట్) డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ), రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) తీసుకున్న నిర్ణయం ప్రకారం బుధవారం నుంచి మూడురోజులపాటు డ్యూటీలను బహిష్కరిస్తున్నామని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సాగర్, జనరల్ సెక్రెటరీ కార్తీక్ తెలిపారు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
నీట్ పీజీ కౌన్సెలింగ్ లేట్ అవుతుండడంతో దేశంలోని రెసిడెంట్ డాక్టర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కేంద్రం, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, కేసును త్వరగా పరిష్కరించి కౌన్సెలింగ్ స్టార్ట్ చేయాలని కోరారు. డిసెంబర్ 3 వరకు కౌన్సెలింగ్పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోకుంటే 4వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో అన్ని రకాల ఎలెక్టివ్ సర్వీసులను బహిష్కరిస్తామన్నారు.