హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు కాంగ్రెస్ పార్టీ ‘తెలంగాణ ప్రశ్నిస్తున్నది’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 30 రోజుల పాటు ప్రతి రోజూ ఒక ప్రశ్న చొప్పున 30 ప్రశ్నలను అడగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలంగాణ రాష్ట్ర కమ్యూనికేషన్ ఇన్చార్జ్ అజయ్ కుమార్ ఘోష్ శుక్రవారం గాంధీ భవన్లో వెల్లడించారు.
ప్రతి రోజు గాంధీ భవన్తో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నేతలు బీఆర్ఎస్ను ప్రశ్నించనున్నారు. అధికార పార్టీ వైఫల్యాల్లో రోజుకో దానిపై ప్రశ్నిస్తారని చెప్పారు. గాంధీ భవన్లో మధ్యాహ్నం, సాయంత్రం ముఖ్య నేతలు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ను ఎండగడతారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్లను నాలుగు జోన్లుగా విభజించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కో ఆర్డినేషన్ కోసం ఏడుగురు సభ్యుల టీమ్ను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.