వెల్డన్ పోలీస్..! పక్కా నిఘాతో ప్రశాంతంగా నిమజ్జనం.. లొల్లుల్లేవ్.. లొటారాల్లేవ్..!

వెల్డన్ పోలీస్..! పక్కా నిఘాతో  ప్రశాంతంగా నిమజ్జనం.. లొల్లుల్లేవ్.. లొటారాల్లేవ్..!
  • చెదురుముదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతం 
  • మెచ్చుకుంటున్న భక్తజనం 

హైదరాబాద్​సిటీ, వెలుగు :సుమారు10 లక్షలకుపైగా భక్తజనం పాల్గొనే వేడుక.. వందల కిలోమీటర్లు సాగే శోభాయాత్ర.. గ్రేటర్​పరిధిలోనే వందకు పైగా ప్రాంతాల్లో కొనసాగిన నిమజ్జన పర్వాన్ని పోలీసులు పక్కా ప్లాన్​తో ప్రశాంతంగా ముగించారు. ఎక్కడా చిన్న గొడవ జరిగిన దాఖలాలు కూడా లేవు. హింసకు తావు లేకుండా, భారీ ప్రమాదాలకు ఆస్కారం కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సాఫీగా పూర్తి చేశారు. 

దీని కోసం ముఖ్యంగా ట్రాఫిక్, లా అండ్​ఆర్డర్​పోలీసులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. నిమజ్జనాలు మూడో రోజే మొదలుకాగా, అప్పటి నుంచే డ్యూటీల్లో ఉన్నారు. ఐదో రోజు నుంచి నిమజ్జనాలు ఉధృతం కాగా, కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వర్తించారు. అతిముఖ్యమైన టాస్క్​శనివారం ఉండడంతో హుస్సేన్​సాగర్​సహా సిటీలోని 20 ప్రధాన చెరువులు 72 బేబీ పాండ్స్​వద్ద డేగ కళ్లతో నిఘా పెట్టి ముగించారు. 

30 వేల మంది సిబ్బంది..

గ్రేటర్​వ్యాప్తంగా 30 వేల మంది పోలీసులు నిమజ్జనంలో అనుక్షణం కాపలా కాశారు. మండపాల నుంచి నిమజ్జనానికి తరలించే ప్రక్రియ నుంచి మొదలుపెడితే నిమజ్జనం దాకా అంతా తామై వ్యవహరించారు. ఎక్కడా వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకున్నారు. నిమజ్జన జోరులో ఉన్న భక్తులు డ్యాన్సులు, పాటలతో కదలకుండా ఒక్కచోటే ఉంటే సర్ధి చెప్పి.. బతిమిలాడి ముందుకు కదిలేలా చేశారు. ఒకవేళ డీజేలు పెడితే అంతే గట్టిగా హెచ్చరించి బంద్​చేయించారు. వైర్​లెస్ సెట్లతో కమ్యూనికేట్​అవుతూ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా చేశారు.

250 సీసీ కెమెరాలు, 160 యాక్షన్​ టీమ్స్​

హైదరాబాద్​ పరిధిలో నిమజ్జనం విజయవంతం చేయడానికి పోలీసులు ఇంతకుముందు ఉన్నవాటికంటే అదనంగా 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 9 డ్రోన్లు, 35 హై రైజ్ బిల్డింగ్స్ పై కెమెరాలు పెట్టి మానిటరింగ్ చేశారు. ఎప్పటికప్పుడు కమాండ్​కంట్రోల్​సెంటర్​నుంచి పర్యవేక్షిస్తూ సూచనలు , సలహాలు ఇచ్చారు. 160 యాక్షన్​టీమ్స్​తో పాటు 13 కంట్రోల్​రూమ్స్, ​228 పికెట్ ఏరియాలను ఏర్పాటు చేశారు. 15 షీటీమ్స్​ఏర్పాటు చేసి ఈవ్​టీజర్స్​పై నిరంతర నిఘా పెట్టారు. 

 సైబరాబాద్ ​కమిషనర్​ ఫీల్డ్​ విజిట్స్​ 

సైబరాబాద్​కమిషనర్​అవినాశ్​మహంతి .. ఆయన టీమ్.. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా పని చేశారు.. . సీపీ మహంతి ఆయన పరిధిలోని చెరువుల వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి నిమజ్జనం గురించి పలు సూచనలు చేశారు. శోభాయాత్రలు, చెరువుల వద్ద నిమజ్జనాలను ఎప్పటికప్పుడూ పబ్లిక్​సేఫ్టీ ఇంటిగ్రేటెడ్​ఆపరేషన్స్​సెంటర్​నుంచి పర్యవేక్షించారు. యాంటీ సబోటేజ్​ తనిఖీలు నిర్వహించారు. 

అంతా తానై రాచకొండ సీపీ సుధీర్​బాబు 

రాచకొండ కమిషనర్​సుధీర్​బాబు కూడా ఎక్కువ శాతం ఫీల్డ్​లోనే ఉన్నారు. హుస్సేన్​సాగర్​తర్వాత ఎక్కువగా విగ్రహాలు నిమజ్జనమయ్యే సరూర్​నగర్​చెరువు వద్ద పక్కాగా బందోబస్తు నిర్వహించారు. మండపాల ఏర్పాటు కోసం పోలీస్ పోర్టర్ లో అప్లై చేసుకున్నప్పటి నుంచి నిర్వాహకులతో పోలీస్ సిబ్బంది టచ్ లో ఉండి నిమజ్జనమయ్యేంతవరకు ఫాలో అప్ చేయాలని రాచకొండ సీపీ సుధీర్​బాబు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో డీసీపీ, ఏసీపీ, సీఐ, ఇతర సిబ్బందిని అలర్ట్ చేశారు.  300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి100కు పైగా సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.  

హైదరాబాద్​పై ఎక్కువ ఒత్తిడి 

హైదరాబాద్​ విషయానికి వస్తే సీపీ సీవీ ఆనంద్​, ట్రాఫిక్ ​సీపీ జోయల్ ​డేవిస్​ నిమజ్జనం సక్సెస్​ కావడానికి చాలా శ్రమపడ్డారు. సీపీ సీవీ ఆనంద్​అన్ని జోన్ల పరిధిలోని పోలీసులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించారు. శుక్రవారం మిలాద్​ ఉన్​ నబీ రావడంతో ముస్లిం మత పెద్దలతో మాట్లాడి ర్యాలీలు తీయకుండా ఒప్పించారు. ఇది పెద్ద సక్సెస్​ అనే చెప్పొచ్చు. అలాగే, ట్రాఫిక్ ​సీపీ  జోయల్ ​డేవిస్​ కూడా ట్రాఫిక్​ తిప్పలు ఉండకుండా  కొన్ని నెలల ముందు నుంచే యాక్షన్​ ప్లాన్​ రెడీ చేసుకున్నారు. మూడు ప్రధాన మార్గాల్లో శోభాయాత్ర కష్టమైనది కావడంతో  పక్కాగా ట్రాఫిక్​ ఆంక్షలు, డైవర్షన్స్​ విధించి అమలు చేసి సక్సెస్​ అయ్యారు.

హుస్సేన్​సాగర్​ వద్దే 3,200 మంది 

ప్రఖ్యాత ఖైరతాబాద్​గణపతి, బాలాపూర్​గణేశుడితో పాటు వేల సంఖ్యలో నిమజ్జనాలు అయ్యే హుస్సేన్​సాగర్​పైనే పోలీసులు స్పెషల్​ఫోకస్​పెట్టారు. సుమారు 21 కిలోమీటర్లు సాగే బాలాపూర్​శోభాయాత్ర, ఖైరతాబాద్​అతి భారీ గణపయ్య ఊరేగింపు ఎటువంటి ఇన్సిడెంట్​జరగకుండా ముగించారు. అనుకున్న టైంలోపు ఈ రెండు విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తి చేసి సక్సెస్​అయ్యారు. వీటితో పాటు వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనయ్యే అవకాశం ఉండడంతో దీనిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఏకంగా హుస్సేన్​సాగర్​తీరంలోనే 3200 మంది పోలీసులను మోహరించారు.