- 317 జీఓతో వేర్వేరు చోట్ల తల్లిదండ్రుల ఉద్యోగాలు
- తన బాధను చెప్పుకుంటూ వాయిస్ రికార్డు పోస్ట్ చేసిన తల్లి
మల్యాల, వెలుగు : 317 జీఓతో మహిళా కానిస్టేబుల్ఒక జిల్లాలో..భర్త మరో జిల్లాలో డ్యూటీ చేస్తున్నారు. మూడేండ్ల కొడుకును తన వెంట తీసుకువెళ్లినా నాన్నా..నాన్న అంటూ కలవరిస్తున్నాడు. భర్త ఎడబాటు, నాన్న కోసం ఏడుస్తున్న కొడుకు ఆవేదనను తట్టుకోలేక ఆ తల్లి చలించిపోయింది. ఏడుస్తూ సీఎంకు, డీజీపీకి తన బాధను చెప్పుకుంటూ వాయిర్ రికార్డు చేసింది. ‘సీఎం సారూ అమ్మానాన్నలను కలపండి’ అంటూ కొడుకు పట్టుకున్న ప్లకార్డుతో కలిపి వాయిస్ రికార్డును సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడిది వైరల్గా మారింది.
జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్స్టేషన్లో పని చేస్తున్న మంజుల అనే కానిస్టేబుల్ ఇంతకుముందు సిరిసిల్ల జిల్లాలో పని చేశారు. ఈమె భర్త అదే జిల్లాలోని 17 బెటాలియన్ లో డ్యూటీ చేసేవారు. 317 జీఓలో భాగంగా మంజులను మల్యాల పీఎస్కు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఆమె తన మూడేండ్ల కొడుకుతో మల్యాలకు వచ్చి డ్యూటీ చేస్తోంది. బందోబస్తుకు కూడా అతడిని చంకనెత్తుకుని వెళ్లాల్సి వస్తోంది. కొద్ది రోజులుగా కొడుకు నాన్న కోసం కలవరిస్తున్నాడు. కలత చెందిన మంజుల తనకు, తన భర్తకు ఒకేచోట పోస్టింగ్ఇవ్వాలని ఏడుస్తూ పోస్ట్ పెట్టింది. లేకపోతే చచ్చిపోవడం ఒక్కటే మార్గమని చెప్పింది. జిల్లాలు మారడంతో తామంతా వేరుగా ఉండాల్సి వస్తోందని వాపోయింది. ఈ పోస్ట్ చూసిన వారంతా 317 జీఓను రద్దు చేసి, భార్యాభర్తలకు ఒకేచోట పోస్టింగ్ఇవ్వాలని కామెంట్స్ పెడుతున్నారు.