- థర్డ్ స్టార్ రేటింగ్ లోనే అత్యధిక స్కూల్స్
- బెస్ట్ ఫైవ్ స్టార్ ఎనిమిది స్కూళ్లపై కసరత్తు
- స్వచ్ఛ ఏవమ్, హరిత్ విద్యాలయ రేటింగ్ కు శ్రీకారం..
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని బడుల్లో స్వచ్ఛత అంతంత మాత్రంగానే ఉంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా స్వచ్ఛ ఏవమ్, హరిత విద్యాలయ రేటింగ్ ప్రోగ్రామ్ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ (మానవ వనరులు) చేపడుతోంది. ఇందులో భాగంగానే స్వచ్ఛత, హరిత రేటింగ్స్కు శ్రీకారం చుట్టింది.
ఫైవ్ స్టార్ రేటింగ్లో 32 స్కూళ్లు..
ఆగస్టు 1 నుంచి అక్టోబర్15 వరకు స్వచ్ఛ ఏవమ్, హరిత విద్యాలయ రేటింగ్ లో పాల్గొనేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో జిల్లాలో 1,673 స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. పారిశుధ్య నిర్వహణ, టాయిలెట్స్ వినియోగం, తాగునీరు, పచ్చదనంతో పాటు పలు అంశాలను పక్కాగా అమలు చేస్తున్న స్కూళ్లకు రేటింగ్ను ఇచ్చింది. ఈ రేటింగ్ ప్రభుత్వ, ఎయిడెట్, ప్రయివేట్, గురుకులాలు, కస్తూర్బా స్కూళ్లు పాల్గొన్నాయి.
స్వచ్ఛ ఏవమ్, హరిత విద్యాలయ రేటింగ్ కు దరఖాస్తు చేసుకున్న స్కూళ్లను గత రెండు వారాలుగా 90 మంది స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు పరిశీలించారు. సెల్ఫ్గా ఇచ్చుకున్న రేటింగ్స్ను పరిశీలించి వారు ఫైనల్ రేటింగ్స్ ఇచ్చారు. ఆ స్కూళ్లలో ఫైవ్స్టార్ రేటింగ్కు 32 స్కూల్స్ ఎంపికయ్యాయి. ఫోర్స్టార్ రేటింగ్కు 454 స్కూల్స్, త్రీ స్టార్ రేటింగ్కు 933, టూ స్టార్ రేటింగ్కు 192, సింగిల్ స్టార్ రేటింగ్కు 62 స్కూళ్లను సెలెక్ట్ చేశారు.
ఫైవ్ ఫోర్ స్టార్రేటింగ్స్ స్కూళ్లలో తనిఖీలు..
ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న 32 స్కూళ్లు, ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న 454 స్కూల్స్పై ప్రత్యేకంగా నియమించిన ఇవాల్యూయేటర్లు అక్టోబర్ 31వరకు తనిఖీలు నిర్వహించారు. ఫైనల్గా ఎనిమిది స్కూల్స్ను సెలెక్ట్ చేశారు. ఇందులో రూరల్ విభాగంలో ఒకటి నుంచి ఎనిమిది తరగతి వరకు ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ మూడు, తొమ్మిదో తరగతి నుంచి ఆపైన ఉన్న స్కూల్స్ మూడు, అర్బన్ విభాగంలో ఇదే పద్ధతిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఎనిమిది స్కూళ్లను సెలెక్ట్ చేశారు. ఈ స్కూళ్లకు కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు.
స్టేట్ లెవెల్ పోటీలకు ఒకటి లేదా రెండు స్కూళ్లు..
స్టేట్ లెవెల్ పోటీలకు ఫైనల్గా సెలెక్ట్ చేసిన ఎనిమిది స్కూళ్లలో ఒకటి లేదా రెండింటిని జిల్లా అధికారులు ఎంపిక చేయనున్నారు. డీఈఓ, డీఎంహెచ్వో, ఇరిగేషన్, డీపీఓ, విద్యాశాఖ, మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లకు చెందిన ఆఫీసర్ల బృందం ఈ ఎనిమిది స్కూళ్లలో స్టేట్ లెవెల్ పోటీలకు వెళ్లే స్కూల్స్ను ఎంపిక చేయనున్నారు. స్టేట్ లెవెల్లో బెస్ట్ అని తేలితే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనవచ్చు. జాతీయ స్థాయిలో గెలిచే స్కూళ్లకు రూ. లక్ష చొప్పున నగదు, అవార్డును కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇవ్వనుంది.
