- సీబీడీటీ చైర్పర్సన్ నితిన్ గుప్తా వెల్లడి
- చెల్లింపు కోసం స్పెషల్ కాల్ సెంటర్
న్యూఢిల్లీ: 35 లక్షల మంది ఎసెసీలకు రీఫండ్స్ చెల్లించడంలో ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్కు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సీబీడీటీ చైర్పర్సన్ నితిన్ గుప్తా మంగళవారం వెల్లడించారు. పన్ను చెల్లింపుదారుల బ్యాంకు అకౌంట్ల వాలిడేషన్సమస్యలే దీనికి కారణమని పేర్కొన్నారు. దీంతో ఎసెసీలను చేరడం కోసం స్పెషల్ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీలైనంత త్వరలో ఈ సమస్యలు పరిష్కరించి, రీఫండ్లు చెల్లించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు.
ఎసెసీలకు చెందిన సరైన బ్యాంకు అకౌంట్లలో రీఫండ్ను జమ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. 2010–11 నాటి పాత డిమాండ్స్ఎసెసీలకు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నకు నితిన్ గుప్తా వివరణ ఇచ్చారు. ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ తన టెక్నాలజీని 2011 టైములో మార్చుకుందని, అప్పుడే పేపర్బేస్డ్ రిజిస్టర్ల నుంచి కంప్యూటర్లకు మారిందని ఆయన చెప్పారు. ఆ కారణం వల్లే కొంత మంది ఎసెసీలకు పాత డిమాండ్స్ కనబడుతున్నాయని వివరించారు.
అయితే, కిందటేడాది నుంచే యూనిక్ డిమాండ్ మేనేజ్మెంట్ ఫెసిలిటేషన్ సిస్టమ్ను అమలులోకి తెచ్చామని, రీఫండ్స్ ఆగిపోయిన ఎసెసీల కోసమే ఈ సిస్టమ్ పని చేస్తోందని అన్నారు. పన్ను చెల్లింపుదారులందరికీ ఒక ఈ–మెయిల్ పంపామని, అది అందిన నాటి నుంచి మూడు రోజులలోపు వారికి తమ డిపార్ట్మెంట్ కాల్ సెంటర్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుందని అందులో పేర్కొన్నామని, ఆ విధంగా ఎసెసీల రీఫండ్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని గుప్తా చెప్పారు. మైసూరులోని కాల్ సెంటర్ ద్వారా కిందటేడాది 1.40 లక్షల రీఫండ్ కేసులను పరిష్కరించగలిగినట్లు వెల్లడించారు.
అయితే, తాము పంపే డిమాండ్ను ఎసెసీ ఒప్పుకోవచ్చని లేదంటే కంటెస్ట్ చేసేందుకూ వారికి అవకాశం ఉంటుందని గుప్తా చెప్పారు. తొలి దశలో కర్నాటక, గోవా, ముంబై, ఢిల్లీ, నార్త్–వెస్ట్ రేంజ్ల కోసం కాల్ సెంటర్ పనిచేసేదని, ఇప్పుడు దానిని అన్ని ఇతర ప్రాంతాలు, సిటీల కోసమూ పనిచేయించనున్నామని వివరించారు. రీఫండ్స్ ఆగిపోవడానికి సాధారణంగా రెండు కారణాలుంటాయని....ఒకటి ఎసెసీలు తమ బ్యాంకు అకౌంట్లను వాలిడేట్ చేయకపోవడమని, లేదంటే ఆ ఎసెసీ అకౌంటుండే బ్యాంకు వేరే బ్యాంకులో మెర్జ్ కావడమని గుప్తా చెప్పారు. కాకుంటే, ఎసెసీ వేరే ఏదైనా సిటీకి మారడం వల్ల ఐఎఫ్ఎస్సీ కోడ్లో మార్పు ఉండటం వల్ల కూడా రీఫండ్ ప్రాసెస్నిలిచిపోవచ్చని వివరించారు.
బ్యాంకు అకౌంట్లను వాలిడేట్ చేసుకోండి...ఎసెసీలకు సూచన
ట్యాక్స్ పేయర్లందరూ తమ బ్యాంకు అకౌంట్లను వాలిడేట్ చేసుకోవాల్సిందిగా గుప్తా కోరారు. పైన పేర్కొన్న కారణాల వల్ల 35 లక్షల మందికి రీఫండ్ నిలిచిపోయిందని, తాము చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నామని సీబీడీటీ చైర్పర్సన్ చెప్పారు. 2023–24 ఎసెస్మెంట్ ఇయర్కు గాను 7.27 కోట్ల రిటర్నులు ఫైలయ్యాయి. ఎసెసీలు వాటి వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు. ఇందులో 6.80 కోట్ల మంది ఎసెసీల రిటర్నుల ప్రాసెసింగ్ను ఐటీ డిపార్ట్మెంట్ పూర్తి చేసింది.
అంటే, వెరిఫైడ్ ఐటీఆర్లలో 93.50 శాతం రిటర్నుల ప్రాసెసింగ్ పూర్తయినట్లు. కార్పొరేట్లలో 60 శాతం తమ లాభాలను కొత్త ట్యాక్స్ రెజీమ్ కిందనే ఫైల్ చేశారని, వ్యక్తులలో కూడా 60–70 శాతం మంది కొత్త విధానానికి మారతారని తాము ఆశిస్తున్నామని గుప్తా వెల్లడించారు. ఇప్పటిదాకా మొత్తం రూ. 9.57 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్లు వసూలయినట్లు పేర్కొన్నారు.