ముంబై: ఐపీఎల్–19వ సీజన్ కోసం ప్లేయర్ల వేలానికి రంగం సిద్ధమైంది. వేలం కోసం 1390 మంది పేర్లను నమోదు చేసుకోగా, అందులో నుంచి 350 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఇందులో 240 మంది ఇండియా ప్లేయర్లు ఉన్నారు. 10 జట్లలో 31 మంది పారిన్ ప్లేయర్లతో కలిపి 77 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
తొలి సెట్లో ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు. వీరిద్దరి బేస్ప్రైస్ రూ. 75 లక్షలుగా ఉంది. స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, డేవన్ కాన్వే, డేవిడ్ మిల్లర్ రూ. 2 కోట్ల బేస్ప్రైస్తో వేలంలోకి వచ్చారు. డికాక్ (రూ. 1 కోటి) పేరును ఆలస్యంగా చేర్చారు. కోల్కతా రిలీజ్ చేసిన వెంకటేశ్ అయ్యర్ రూ. 2 కోట్ల బేస్ప్రైస్తో అందుబాటులోకి వచ్చాడు. అత్యధికంగా కేకేఆర్ రూ. 64.3 కోట్ల పర్స్తో వేలానికి రానుంది. సీఎస్కే (రూ. 43.4 కోట్లు), హైదరాబాద్ (రూ. 25.5 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇంగ్లండ్ నుంచి జెమీ స్మిత్, అట్కిన్సన్, లివింగ్స్టోన్, బెన్ డకెట్తో సహా మొత్తం 21 మంది బరిలో ఉన్నారు. ఆసీస్ నుంచి గ్రీన్, ఇంగ్లిస్, షార్ట్, కనోలీ, బ్యూ వెబ్స్టర్ ప్రముఖంగా పోటీపడుతున్నారు. సౌతాఫ్రికా ప్లేయర్లు డికాక్, మిల్లర్, అన్రిచ్, ఎంగిడి, కోయెట్జీ, ముల్డర్.. విండీస్ నుంచి అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, అకీమ్ అగస్టే, షై హోప్, రోస్టన్ ఛేజ్, శ్రీలంక స్పిన్నర్లు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, ట్రావీన్ మాథ్యూ, నిశాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరాపై కూడా దృష్టి నెలకొంది. కివీస్, అఫ్గానిస్తాన్ నుంచి వరుసగా 16, 10 మంది వేలంలో ఉన్నారు.

