విదేశాల నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేసేందుకు కొందరు ప్రయాణీకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెన్ని రకాలుగా మాయ చేసినా.. కస్టమ్స్ అధికారులు వారిని ఇట్టే పసిగట్టి వారి దగ్గర నుండి ఆ అక్రమ సంపదను స్వాధీనం చేసుకుంటున్నారు.
తాజాగా సోమవారం దుబాయ్ నుంచి చెన్నై వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి రూ.22.2 లక్షల విలువైన 4 బంగారు కడ్డీలను అధికారులు సొంతం చేసుకున్నారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద ఆ వ్యక్తిని తనిఖీ చేయగా.. అతడి బ్యాగ్ కు ఇరువైపులా ఒక వైరు రూపంలో ఉన్న బంగారు కడ్డీలు బయటపడ్డాయి. అవి అక్రమంగా తరలిస్తున్నాడని తేలడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని, అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తి చెన్నై నగరానికి చెందినవాడిగా తెలిసింది.