- ఇంకా లభ్యం కాని మరో ముగ్గురి ఆచూకీ
- నేతల మృతి పట్ల కర్ణాటక సీఎం దిగ్భ్రాంతి
- ట్విటర్ ద్వారా సంతాపం తెలిపిన కుమార స్వామి
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో కర్ణాటక కు చెందిన ఏడుగురు జేడీఎస్ నేతలు అదృశ్యమయ్యారు. వారిలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మృతిచెందిన వారిలో ఇద్దరు కే.జీ. హనుమంతరాయప్ప, ఎం రంగప్పగా గుర్తించినట్టు కొలంబోలోని భారత హైకమిషనర్ కార్యాలయం తెలిపింది.
జేడీఎస్ నేతల మృతి పట్ల తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ట్వీట్ చేశారు. తమ పార్టీ నేతల మృతి షాక్ కు గురి చేసిందని తెలిపారు మృతి చెందిన వారిలో మరో ఇద్దరు లక్ష్మణ గౌడ రమేష్, కె.ఎమ్. లక్ష్మీ నారాయణన్ గా తెలిపారు.వారి మరణం పార్టీకి తీరని లోటు అని ట్వీట్ చేశారు. మరో ముగ్గురు హెచ్. శివు కుమార్, ఎ. మారెగౌడ, హెచ్ పుట్టరాజు ఆచూకీ ఇంకా తెలియలేదని కుమార స్వామి తెలిపారు.
జేడీఎస్కు చెందిన ఈ ఏడుగురు నేతలు ఎన్నికల ప్రచారం తర్వాత ఈ నెల 20న శ్రీలంక వెళ్లారు. కొలొంబోలోని ద షాంగ్రిలా హోటల్లో రెండు గదుల్లో బస చేసినట్లు సమాచారం. బాంబు ఘటన తర్వాత వీరి ఆచూకీ తెలియలేదు. ప్రస్తుతం నేతల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతిచెందిన సంఖ్య 290కి చేరింది. 500మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 6 మంది భారతీయులు ఉన్నారు.