- వెల్లడించిన ప్రపంచ బ్యాంక్
వాషింగ్టన్: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మన దేశంలో విధించిన లాక్డౌన్ దాదాపు 40 మిలియన్ల ఇంటర్నల్ మైగ్రెంట్స్పై ప్రభావం చూపిందని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. దీంతో 50–60 వేల మంది తమ సొంత వూళ్లకు తిరిగి వెళ్లిపోయారని నివేదిక ఇచ్చింది. లాక్డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయి, సోషల్ డిస్టెంసింగ్ పాటించలేక పోవడం వల్ల మన దేశం, లాటిన్ అమెరికాలోని చాలా మంది అంతర్గత వలసదారులు భారీగా తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోయారని చెప్పింది. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో సౌత్ ఏషియాలోని ఇంటర్నేషనల్, ఇంటర్నల్ వలసదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. వాళ్లందర్నీ ఆరోగ్య సేవలు, నగదు బదిలీ లాంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాలను సూచించింది. కొన్ని దేశాల్లో వైరస్ ముందే వ్యాప్తి చెందటంతో అప్రమత్తమైన కొంత మంది ట్రావెల్ బ్యాన్ విధించకముందే సొంత దేశాలకు తిరిగి వచ్చారని, కొంత మందిని ఆయా దేశాలు స్పెషల్ రిక్వెస్ట్పైన రప్పించారని చెప్పింది. ఈ ఏడాది వలస వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెప్తోంది. ఇప్పటికే అక్కడికి వెళ్లిన వారు మాత్రం ఇప్పట్లో తిరిగొచ్చే అవకాశాలు లేవని, ట్రావెల్ బ్యాన్ వల్ల వాళ్లంతా ఎక్కడి వాళ్లు అక్కడే ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయంది. వలసదారులకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వాలు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యుల తీసుకోవాలని, వారికి ఆదాయాన్ని కోల్పోకుండా కార్మికులకు ఉద్యోగాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వరల్డ్ బ్యాంక్ సూచించింది.