కరీంనగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పరామర్శ కు వచ్చిన మంత్రి లిఫ్ట్ ఎక్కుతుండగా రోప్ తెగిపోవడంతో కిందపడిపోయింది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆయనను రక్షించడంతో ప్రమాదం తప్పింది.
అసలేం జరిగిందంటే.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మొదటి అంతస్తు నుండి కిందకు వచ్చేందుకు లిఫ్ట్ ఎక్కారు. అయితే, లిఫ్ట్ కిందికి వస్తుండగా సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. క్షణాల వ్యవధిలోనే ఫస్ట్ ఫ్లోర్ నుండి లిఫ్ట్ నేరుగా కింద పడిపోవడంతో మంత్రి అందులోనే ఇరుక్కుపోయారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన మంత్రి వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి లిఫ్ట్ తలుపులు తెరిచి మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. అత్యవసర సేవలందించే ఆసుపత్రిలో కనీస నిర్వహణ లేకపోవడంపై మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు.
