ఫీల్డ్లోకి మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్స్

ఫీల్డ్లోకి  మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్స్ ఎట్టకేలకు మంగళవారం ఫీల్డ్​లోకి దిగాయి. మొత్తం150 టీమ్స్ పనిచేయనుండగా, ఒక్కో టీమ్ లో షిఫ్టులో న‌లుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు ప‌ని చేయనున్నారు. 150 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల్లో 1800 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే, వ‌ర్షపు నీరు నిలిచే చోట రెండు షిఫ్టుల్లో ప‌ని చేసేలా 368 స్టాటిక్ టీమ్స్ కూడా రెడీ అయ్యాయి.  ఇందులో మొత్తం 734 మంది పనిచేయనున్నారు. వీరికి తోడుగా 51 హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు పనిచేయనున్నాయి.

 ఒక్కో డీఆర్ఎఫ్​టీమ్‌లో 18 మంది చొప్పున  918 మంది సేవ‌లందించనున్నారు. వీరు ఒక్కో షిఫ్టులో ఆరుగురు చొప్పున ప‌ని చేస్తారు. అలాగే, 21 ఎమర్జెన్సీ బైక్ ​టీమ్స్​ఉన్నాయి. ఒక్కో బైక్​పై ఇద్దరు చొప్పున 42 మంది ప‌ని చేయనున్నారు. 30 స‌ర్కిళ్లలో ప‌నుల‌ను ప‌ర్యవేక్షించేందుకు హైడ్రాకు చెందిన మార్షల్స్ 30 మందికి బాధ్యతలు అప్పగించారు. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులతో క‌లిసి ప‌ని చేసేందుకు రెండు షిప్టుల్లో క‌లిపి 200 మందితో 20 బృందాలు, చెట్ల కొమ్మలు, చెత్తను తరలించేందుకు ఒక్కో షిప్టులో ముగ్గురు చొప్పున 240 మంది అందుబాటులో ఉండనున్నారు. మాన్సూన్​లో సేవలందించేందుకు 4100 మంది పనిచేయనున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కమిషనర్ రంగనాథ్ అధికారులు, సిబ్బందికి ఆదేశించారు.