కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. 420 మోసాలు చేసిన వాళ్లు వచ్చే ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపుపై మాట్లాడుతున్నారంటూ బీజేపీ పేరు ప్రస్తావించకుండా కామెంట్స్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు వస్తాయని ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా అది అహంకారమేననిఅన్నారు.
కర్నాటకలోని చిక్కమంగళూరు ప్రెస్క్లబ్లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. 420 చేసిన వారే 400 సీట్లు వచ్చేలా మాట్లాడతారని, అది ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, మరేదైనా అహంకారానికి అద్దం పడుతోందని చెప్పారు. ఒక పార్టీ 400 సీట్లలో గెలవడం సాధ్యం కాదన్నారు ప్రకాష్ రాజ్.
400 సీట్లతో మూడోసారి ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న రాజ్యసభలో చెప్పారు. ఇందులో ఒక్క బీజేపీకి ఒంటరిగా 370 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాము తిరిగి అధికారకంలోకి వచ్చేందుకు ఎన్నో రోజుల టైమ్ లేదన్నారు మోదీ.