యూపీలో ఘోరం: పెళ్ళికి వెళ్లి వస్తూ గుంతలో పడ్డ కారు.. ఐదుగురు మృతి..

యూపీలో ఘోరం: పెళ్ళికి వెళ్లి వస్తూ గుంతలో పడ్డ కారు.. ఐదుగురు మృతి..

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది.. పెళ్ళికి వెళ్లొస్తున్న కారు గుంతలో పడి.. ఐదుగురు మృతి చెందగా... మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం ( మే 31 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో  ఎర్టిగా కారు అదుపు తప్పి గుంతలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు కుసుమ గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై పాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటియానిమ్ గ్రామానికి తిరిగి వస్తుండగా... ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 

ఆలంనగర్ రోడ్డులోని షార్ప్ టర్న్ దగ్గర డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో కారు అతివేగంగా వెళ్లి బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 15 మంది ఉన్నట్లు సమాచారం.. బాధితులంతా పాటియానిమ్ వాసులుగా తెలుస్తోంది. 

Also Read : బీజేపీ మాజీ నేత కొడుకుకు జీవిత ఖైదు

క్షతగాత్రులను షాహాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించిన కొద్దిసేపటికే ఐదుగురూ మరణించినట్లు తెలిపారు డాక్టర్లు. తీవ్ర గాయాలైన ఆరుగురికి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కారు లోపల చిక్కుకున్న బాధితులను బయటికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో పాటియానిమ్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. అప్పటిదాకా పెళ్ళిలో సందడిగా గడిపినవారిని విగతజీవులుగా చూసి.. మృతుల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.