ఇస్లామాబాద్: పాకిస్తాన్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జూన్ చివరి వారం నుంచి మొదలైన వానలు, వరదలతో ఇప్పటిదాకా 50 మంది చనిపోయారు. మరో 87 మంది గాయపడ్డారు. వర్షాల వల్ల ఒక్క పంజాబ్ ప్రావిన్స్లోనే 34 మంది చనిపోయినట్లు పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎమ్ఏ) శుక్రవారం వెల్లడించింది.
ఖైబర్-–పఖ్తుంక్వాలో పదిమంది, బలూచిస్తాన్లో ఐదుగురు, పీవోకేలో ఒకరు చనిపోయినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 62 ఇండ్లు దెబ్బతిన్నాయని..15 జంతువులు మృతి చెందాయని తెలిపింది. వరదల కారణంగా హైవేలపై నీళ్లు నిలిచాయని..దాంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని పేర్కొంది.
వరదలను ఎదుర్కోవడానికి ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హై అలర్ట్ జారీ చేసింది. సింధ్, పంజాబ్లను కలిపే కొన్ని హైవేలపై రాకపోకలు నిలిపివేసింది.
