ట్రాప్​లో చిక్కుకున్న చైనా సబ్​మెరైన్.. 55 మంది నావికులు మృతి

ట్రాప్​లో చిక్కుకున్న చైనా సబ్​మెరైన్..  55 మంది నావికులు మృతి

న్యూఢిల్లీ: శత్రు దేశాల నౌకలను, సబ్​మెరైన్​లను అడ్డుకునేందుకు చైనా అమర్చిన ఉచ్చులో తన సొంత సబ్​మెరైనే చిక్కుకుంది. దీంతో అందులోని 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి నెలరోజులు దాటినా చైనా సర్కారు మాత్రం ప్రపంచానికి తెలియనివ్వలేదు. కొద్దిరోజులకిందే అమెరికన్ నేవీ ఈ విషయాన్ని బయటపెట్టగా.. అదంతా ఉత్త ముచ్చటేనంటూ డ్రాగన్ దేశం కొట్టిపారేసింది. అయితే, సబ్​మెరైన్ మునిగింది, 55 మంది ప్రాణాలు నీళ్లలో కలిసింది నిజమేనంటూ బ్రిటిష్  ఇంటలిజెన్స్ వర్గాలు తేల్చిన రిపోర్టును ఇంటర్నేషనల్ మీడియా తాజాగా బయటపెట్టింది.

ఆక్సిజన్ అందకపోవడంతో..

చైనా తయారు చేసిన అత్యాధునిక 093–417 న్యూక్లియర్ సబ్​మెరైన్ దాదాపు 350 అడుగుల పొడవు ఉంటుంది. ఇది.. షాండాంగ్ ప్రావిన్స్​లోని ఎల్లో సముద్రంలో ఆగస్ట్ 21న ఉదయం 8.21 గంటలకు ట్రాప్​లో చిక్కుకుంది. అమెరికా, బ్రిటన్ సబ్​మెరైన్లను అడ్డుకునేందుకు చైనానే ఏర్పాటుచేసిన ఈ ట్రాప్​ ‘చైన్​–యాంకర్​’ను సబ్​మెరైన్ ఢీకొట్టింది. దీంతో సబ్​మెరైన్​లోని బ్యాటరీ సిస్టమ్ దెబ్బతిని అందులోని ఎయిర్ ప్యూరిఫైర్, ఎయిర్ సిస్టమ్స్ పనిచేయక పోయుండొచ్చని రిపోర్టులో పేర్కొంది. ఆల్టర్నేట్ ఆక్సిజన్ కోసం చేసిన  ప్రయత్నం బెడిసికొట్టి సబ్​మెరైన్ లోపలున్న ఆక్సిజన్ విషపూరితం అయి ఉంటుందని పేర్కొంది. మరమ్మతులకు 6 గంటలకు పైగా పట్టిందని, ఆలోపే 55 మంది చనిపోయారని బ్రిటన్ మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. మృతుల్లో సబ్​మెరైన్ కెప్టెన్​తో సహా ఆఫీసర్లు, కేడెట్స్, నేవీ సిబ్బంది ఉన్నారని చెప్పాయి. ఈ ఘటన జరిగిన వెంటనే వెస్ట్రన్ కంట్రీస్​ పత్రికలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. సబ్​మెరైన్​ ప్రమాదంలో ఉన్నట్లు మెసేజ్ అందినట్లు పొరుగు దేశాలు కూడా ప్రకటించాయి. చైనా మాత్రం అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేసింది.