13 రోజుల్లో 62% మందికి రేషన్.. 56.40 లక్షల కుటుంబాలకు 3 నెలల బియ్యం పంపిణీ

13 రోజుల్లో 62%  మందికి రేషన్.. 56.40 లక్షల కుటుంబాలకు 3 నెలల బియ్యం పంపిణీ
  • ప్రారంభంలో టెక్నికల్ సమస్యలు వచ్చినా క్రమంగా స్పీడప్
  • ఈ నెలాఖరు వరకు పంపిణీకి సివిల్ సప్లయిస్​ శాఖ ఏర్పాట్లు
  • ఒకేసారి పెద్ద ఎత్తున సన్న బియ్యం రావడంతో లబ్ధిదారుల్లో హర్షం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధిదారులకు ఈ నెల ప్రారంభం నుంచి సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 62 శాతం రేషన్​ పంపిణీ ప్రక్రియ పూర్తయింది. వర్షాకాలం సీజన్​ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు జూన్, జులై, ఆగస్టు నెలల రేషన్​ను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున రాష్ట్రంలోని 91.83 లక్షల రేషన్​ కార్డులున్న కుటుంబాలకు సివిల్​ సప్లయిస్​ శాఖ రేషన్​ పంపిణీ చేపట్టింది. ఈ నెలాఖరు వరకు రేషన్​ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి సివిల్​ సప్లయిస్ ​​అధికారులు అన్ని  ఏర్పాట్లు చేశారు. ఇటీవల కొత్త రేషన్​ కార్డులు ఇవ్వడంతోపాటు పదేండ్లుగాపెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

56.40 లక్షల కార్డుదారులకు అందిన రేషన్​
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17, 349 రేషన్​ షాపుల ద్వారా ఈ నెల ప్రారంభం నుంచి రేషన్​ పంపిణీ  చేస్తున్నారు. రాష్ట్రంలోని 91.83 లక్షల రేషన్ కార్డుల్లో  56.40 లక్షల కార్డుదారులకు 3 నెలలకు సంబంధించిన రేషన్ ఇప్పటికే చేతికి అందింది. అంటే గత 13 రోజుల్లోనే 62 శాతం మంది రేషన్​ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పూర్తయింది.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్​ షాపుల్లో 1.81 కోట్ల ట్రాన్సాక్షన్​ నిర్వహించి, లబ్ధిదారులకు రేషన్​ పంపిణీ చేసినట్లు సివిల్​ సప్లయిస్​ అధికారులు తెలిపారు.  రాష్ట్రంలో 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు 3 నెలల రేషన్​ పంపిణీ కోసం దాదాపు 5.58 లక్షల టన్నుల సన్నబియ్యం అవవరమవుతాయని సివిల్​ సప్లయిస్​ అధికారులు అంచనా వేసి, సిద్ధం చేశారు.

రేషన్​ షాపుల్లో రోజుకు 15 లక్షల  ట్రాన్సాక్షన్స్​​ జరుగుతున్నాయని, ఇప్పటికే చాలా రేషన్​ షాపుల్లో 100 శాతం రేషన్​ పంపిణీ పూర్తయిందని అధికారుల పేర్కొంటున్నారు.  హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో  గ్రామాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లబ్ధిదారులకు రేషన్​ ఇస్తున్నారు. దీంతో ఆయా రేషన్​షాపుల పరిధిలోని కార్డులకు రేషన్​ పంపిణీ పూర్తయినా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు రేషన్​ పంపిణీ కొనసాగుతున్నది. ఒకేసారి సన్న బియ్యం పెద్ద ఎత్తున ఇంటికి చేరుతుండడంతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. 

టెక్నికల్ సమస్యలు అధిగమించి..
రేషన్​ షాపుల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ-పీఓఎస్) మెషీన్​లో 3 నెలల రేషన్​ ఒకేసారి ఇవ్వడం కోసం కొత్త సాఫ్ట్​వేర్​ను వినియోగిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో రేషన్​ పంపిణీ చేపట్టగా కొత్త సాఫ్ట్​వేర్​ లో  టెక్నికల్ సమస్యలతో ఇబ్బందులు వచ్చాయి.  అయితే,  వాటిని పరిష్కరించడంతో సమస్య తీరింది. రాష్ట్రంలో ఉన్న 91.83 లక్షల రేషన్​ కార్డుల్లో 55 లక్షల వరకు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు ఉండగా 36 లక్షలకు పైగా స్టేట్​ కార్డులున్నాయి.

స్టేట్ కార్డులకు ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోలు ఇస్తుండగా, సెంట్రల్​ గవర్నమెంట్​ ఒక్కో లబ్ధిదారుడికి 5 కిలోలు మాత్రమే ఇస్తున్నది. వీరికి రాష్ట్రం తరఫున మరో కిలో కలిపి ఇస్తున్నారు. దీంతో ప్రతి నెలా సెంట్రల్​ కార్డులున్న లబ్ధిదారుల నుంచి రేషన్ డీలర్లు రెండు సార్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఈ నెలలో మూడు నెలల రేషన్​ను ఒకేసారి ఇస్తుండడంతో ఒక్కో నెలకు రెండుసార్ల చొప్పున 3 నెలల రేషన్​కు ఆరు సార్లు వేలిముద్రలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో సెంట్రల్​ కార్డులకు 6 సార్లు బయోమెట్రిక్​ తీసుకునే విధానాన్ని సరళీకరించి మూడింటికే పరిమితం చేశారు. దీంతో రేషన్ పంపిణీ మరింత స్పీడప్ అయింది.