![హైనా దాడిలో 65 గొర్రెల మృతి](https://static.v6velugu.com/uploads/2024/05/65-sheep-killed-in-hyena-attack_ixEfShqvmT.jpg)
- చిన్నకోడూరు మండలం మాచాపూర్ లో ఘటన
- పట్టుకునేందుకు బోన్ల ఏర్పాటు
సిద్దిపేటరూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో గురువారం గొర్రెల మందపై హైనా దాడి చేయడంతో 65 గొర్రెలు చనిపోయాయి. గ్రామానికి చెందిన మల్లయ్య బుధవారం 90 గొర్రెలను మేపుకొని వచ్చి సాయంత్రం తన పొలంలోని గొర్రెల షెడ్డులో వదిలి ఇంటికి వచ్చాడు. ఉదయం 4 గంటలకు షెడ్డుకు పోయేసరికి 65 గొర్రెలు చనిపోయి ఉన్నాయి.
మరో 25 ప్రాణాపాయ స్థితిలో కనిపించాయి. ఏదో గుర్తు తెలియని జంతువు చంపేసిందని అనుమానించి ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాడు. దీంతో రేంజ్ ఆఫీసర్ ఇక్రముద్దీన్, సెక్షన్ ఆఫీసర్ బుచ్చయ్య, బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ వచ్చి జంతువు కాలి గుర్తులను పరిశీలించారు.
హైనా దాడి చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తనకు రూ. 5 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.