
భారత్లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. రాజస్థాన్లోని జైపూర్కి వచ్చిన ఇటలీ టూరిస్టు వైరస్ లక్షణాలతో శనివారం ఆస్పత్రిలో చేరారు. ఆ ఇటాలియన్కు టెస్టులు చేసిన తర్వాత కరోనా ఉన్నట్లు తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. శనివారం నాడు తీవ్రమైన జ్వరం, జలుబుతో ఇటాలియన్ ఆస్పత్రిలో చేరిన సమయంలో పరీక్షలు చేసినప్పటికీ నెగటివ్ వచ్చింది. అయితే జైపూర్ డాక్టర్లు చికిత్స అందిస్తున్నా.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో సోమవారం మరోసారి టెస్ట్ చేయగా కరోనా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఒకసారి కరోనా లేదని, మరోసారి ఉందని రిపోర్టు రావడంతో నిన్న రాత్రి మళ్లీ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అక్కడ కూడా టెస్టుల్లో కరోనా ఉందని తేలిందని అధికారులు చెప్పారు.
ఇప్పటికే కేరళలో ముగ్గురికి కరోనా రావడంతో చికిత్స తీసుకుని.. పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారు. సోమవారం కొత్తగా ఢిల్లీలో ఒకరికి, హైదరాబాద్లో ఒకరికి కరోనా వచ్చింది. ఆ ఇద్దరు కూడా కరోనా వ్యాప్తి చెంది ఉన్న ఇటలీ, దుబాయ్ దేశాల నుంచి భారత్ వచ్చిన వారే. ఇవాళ రాజస్థాన్లో మరో పేషెంట్తో కలిపి ఇప్పటి వరకు భారత్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆరుకు చేరింది. అయితే ప్రజలెవరూ భయపడాల్సింది లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కరోనా నియంత్రణపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలకు కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.