పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 73 మందికి కరోనా పాజిటివ్

పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 73 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సమీపంలో ఉన్న చంద్రగిరి కల్యాణి డ్యామ్ పోలీస్‌ ట్రైనింగ్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. శిక్షణ పొందుతున్న 348 మందితో పాటు మరో 50 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు అధికారులు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో శుక్రవారం 40 మందికి, శనివారం మరో 33 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ట్రైనింగ్ కాలేజీలో ఇప్పటి వరకు మొత్తం 73 మందికి కరోనా సోకినట్లు తేలగా.. మరింత మంది ఫలితాలు రావాల్సి ఉంది. శిక్షణ పొందుతున్న వారిలో ఎక్కువ మంది కరోనా బారినపడినట్లు అధికారులు భావిస్తున్నారు. విశాఖ, విజయనగరం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు చెందిన కేడెట్స్ ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నారు. ట్రైనింగ్ కాలేజీలో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో వారి కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ పోలీస్ ట్రైనింగ్ కాలేజీని మూసివేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చినవారిని కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించారు అధికారులు.