హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో 76 శాతానికిపైగా కేసులు ఇక్కడే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 34,671 మంది కరోనా బారిన పడగా, అందులో 26,574 మంది గ్రేటర్ పరిధిలోనే ఉన్నారు. టెస్టులు పెంచుతున్న కొద్దీ ఎక్కువ కేసులూ బయటపడుతున్నాయి. యాంటీజెన్ టెస్టులను రాష్ట్ర ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటినీ చేరిస్తే కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పరిస్థితి తీవ్రమవుతుండడంతో బల్దియా మళ్లీ కంటెయిన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తోంది. 500కుపైగా కేసులున్న 8 ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించింది. ఆ ఏరియాల్లో కంటెయిన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి.. స్పెషల్ ఆఫీసర్లను నియమించారు కమిషనర్ లోకేశ్ కుమార్.
ఇవే హైరిస్క్ ప్రాంతాలు
యూసుఫ్గూడ, అంబర్పేట్, మెహదీపట్నం, కార్వాన్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్సర్కిళ్లను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. ఒక్కో చోట 10 నుంచి 20 దాకా.. మొత్తంగా వంద కంటెయిన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించనున్నారు. అయితే, అక్కడ పనిచేసేందుకు వందల సంఖ్యలో సిబ్బంది అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక, హోం ఐసోలేషన్లో ఉంటున్న పేషెంట్లు బయటకు రాకుండా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ల వల్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని భావిస్తున్నఅధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
రాజ్ భవన్ లో 10 మంది సిబ్బందికి కరోనా