
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. కేంద్రంలో పలుకుబడి ఉంది కదా అని.. అన్ని ప్రాజెక్టులకు అనుమతి వస్తుందనుకోవద్దన్నారు. అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకోవడం చంద్రబాబు భ్రమే అవుతుందన్నారు. బనకచర్లను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసన్నారు. తమ హక్కుల కోసం ఎక్కడా రాజీపడబోమన్నారు రేవంత్ . తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడుతామన్నారు. తమ హక్కులు అడ్డు వస్తే రాజకీయంగా పోరాడుతాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు రేవంత్. మోదీకి చంద్రబాబు,చంద్రబాబుకు మోదీ అవసరం ఉందన్నారు. ఇద్దరు పరస్పరం సహకరించుకుంటున్నారని చెప్పారు రేవంత్.
కృష్ణా బేసిన్ లో 500 టీఎంసీలకు, గోదావరి బేసిన్ లో 1000 టీఎంసీలకు ఎన్ వోసీ ఇస్తే బనకచర్లకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పబోమన్నారు రేవంత్. తమ ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా మిగులు జలాలు ఉన్నాయంటున్నారు..కృష్ణా జలాల్లో పదేళ్లలో 299 టీఎంసీలు ఏనాడైనా వాడారా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల ఏపీకి నీళ్లు వస్తున్నాయన్నారు రేవంత్. ఐదు నెలలుగా తెలంగాణ అభ్యంతరాలతోనే బనకచర్ల అనుమతిపై కేంద్రం పునరాలోచనలో పడిందన్నారు రేవంత్.