రాష్ట్రంలో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

రాష్ట్రంలో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది.  జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అని సీఎం కేసీఆర్ అనుకున్న లక్ష్యం నెరవేరిందని మంత్రి హరీష్  రావు అన్నారు.  జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతుందని  తెలిపారు. ఈ అరుదైన రికార్డును తెలంగాణ సొంతం చేసుకుంటుందని తెలిపారు.ఈ 9 ఏండ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేసిందని హరీష్ రావు చెప్పారు.    

మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10 వేల‌కు చేరువ కానున్నాయని మంత్రి  హరీష్ రావు అన్నారు.. మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ‌య్యాయి. స్థానికంగా ఉంటూనే ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశాలు పెరిగాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది అని మంత్రి కొనియాడారు.