
- ఆగస్టు నుంచి వరుసగా
- వానలు, చల్లని వాతావరణం
- అడపాదడపాగా వస్తూ..
- శరీరాన్ని తాకని సూర్యరశ్మి
హైదరాబాద్, వెలుగు: వాతావరణ మార్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆగస్టు నుంచి వరుసగా మబ్బులు పడుతూ వానలు కురుస్తుండడంతో వాతావరణం చల్లగా ఉంటున్నది. మరోవైపు మధ్య మధ్యలో ఉక్కపోత పోస్తున్నది. ఈ మిశ్రమ వాతావరణంతో గాలిలో తేమశాతం పెరిగి, వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. చిన్న చిన్న జ్వరాలకే ప్రజలు వారం, పది రోజులు మంచాన పడుతున్నారు. గతంలో మూడు రోజుల్లో తగ్గే వైరల్ ఫీవర్స్, ఇప్పుడు పది, పదిహేను రోజులైనా తగ్గడం లేదు. దీనికి కారణం డీ విటమిన్ లోపించడమేనని డాక్టర్లు చెబుతున్నారు. ఆగస్టు నుంచి వరుసగా వానలు కురుస్తున్నాయి. వర్షాలు మొదలైనప్పటి నుంచి ఎక్కువ రోజులు ఆకాశం మబ్బుపడుతున్నది. ఎప్పుడో ఒక రోజు మధ్యాహ్నం పూట తప్ప.. సూర్యుడు కంటికి కనిపించడం లేదు. ఉదయం పూట వాతావరణం చల్లగా ఉంటున్నది. దీంతో కావాల్సినంత సూర్యరశ్మి లభించడం లేదు. తద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతున్నది. ఈ కారణంతో చిన్న చిన్న జర్వాలు కూడా వారం పది రోజుల వరకు తగ్గడం లేదు. గాలిలో తేమ శాతం పెరగడం కూడా వైరల్ ఫీవర్లు పెరగడానికి మరో కారణమని డాక్టర్లు చెబుతున్నారు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే, వైరస్ గాలిలో ఎక్కుసేపు ఉంటుందని, దీంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జ్వరాల వ్యాప్తితోపాటు డీ విటమిన్ లోపాన్ని కూడా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
తీవ్రంగా విటమిన్ డీ లోపం
విటమిన్ డీ శరీరంలో టీ -సెల్స్, మాక్రోఫేజెస్లాంటి రోగనిరోధక కణాలను ఉత్తేజ పరుస్తుంది. ఈ కణాలు వైరస్లతో పోరాడి ఇన్ఫెక్షన్ను తగ్గిస్తాయి. ఏదైనా లోపం ఉంటే ఈ కణాలు సమర్థవంతంగా పనిచేయవు. దీంతో వైరల్ ఫీవర్ (జలుబు, ఇన్ఫ్లూయెంజా, డెంగ్యూ) నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే, శ్వాసకోశంలోని లోపలి పొరలను డీ విటమిన్ బలపరుస్తుంది. ఇది వైరస్లు శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. దీనిలోపం వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు తీవ్రమవుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్యగా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తగినంత సూర్యరశ్మి లేకపోడంతో డీ విటమిన్ లోపం ఏర్పడి ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో రోజులపాటు జ్వరాలతో బాధపడాల్సి వస్తున్నది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది ప్రజలు డీ విటమిన్ లోపానికి గురైనట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్వాసులు ఎక్కువగా డీ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్టు తేల్చారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ప్రతి 10 మందికి 8 మందిలో విటమిన్ డీ లోపం ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం పైగా మందిలో విటమిన్ డీ లోపం ఉన్నట్టు చెబుతున్నారు.
దవాఖానల్లో ఓపీ డబుల్
వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్న ప్రజలు దవాఖానలకు క్యూ కడుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దవాఖానల్లో ఓపీ కేసులు డబుల్ అయ్యాయి. సర్ది, దగ్గు, వైరల్ ఫీవర్స్తోపాటు డెంగ్యూ, చికున్ గున్యా లాంటి వ్యాక్టర్ బార్న్ డిసీజెస్ గణనీయంగా పెరిగాయి. ఆగస్టు నుంచి హైదరాబాద్, సూర్యాపేట్, మెదక్, ఆదిలాబాద్, కామరెడ్డి, నల్గొండలాంటి జిల్లాల్లో ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5వేల డెంగ్యూ కేసులు రికార్డయినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల లెక్క ఎక్కువే ఉండొచ్చు. చికున్ గున్యా కేసులు 200కు పైనే ఉన్నాయి. గాంధీ ఆసుపత్రిలో రోజూ సుమారు 2 వేల ఓపీ నమోదవుతున్నది. గతవారం రోజుల్లో 20 శాతం పెరిగింది. ఉస్మానియా హాస్పిటల్లో 1800 ఓపీలు నమోదయ్యాయి. ఫీవర్ హాస్పిటల్లో రోజూ సగటున వెయ్యి ఓపీ కేసులు రికార్డవుతున్నాయి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఓపీ 30 శాతం పెరిగింది. ఈ జిల్లాలో ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో కూడా దాదాపు 2వేల ఓపీ కేసులు నమోదవుతున్నాయి.
విటమిన్ డీ ట్యాబ్లెట్స్ వాడాలి
నాలుగైదు రోజుల వరకు జ్వరం తగ్గకపోతే తగిన జాగ్రత్తలు పాటించాలి. విటమిన్ డీ లోపిస్తే డాక్టర్ల సలహాతో ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడాలి. విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారాలు (ఫ్యాటీ ఫిష్, గుడ్డు సొన, ఫోర్టిఫైడ్ మిల్క్) తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేం దుకు విటమిన్ సీ (నిమ్మజాతి పండ్లు), జింక్ (నట్స్, సీడ్స్) తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్లు 22 నుంచి 25 సెంటీగ్రేడ్ మధ్య ఉండేటట్లు సెట్చేసుకోవాలి. తేమస్థాయి 40–60% మధ్య ఉండేలా చూసుకోవాలి. అధిక తేమవల్ల శ్వాసకోశ సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. తక్కువ తేమ వల్ల గొంతు, చర్మం పొడిబారుతుంది. మాస్క్ ధరించాలి.
- డాక్టర్ సంజీవ్, పల్మనాలజిస్ట్