80 శాతం మందికి లక్షణాలు లేకుండానే కరోనా

80 శాతం మందికి లక్షణాలు లేకుండానే కరోనా
  • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే

ముంబై: మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 80 శాతం ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ వస్తుందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే అన్నారు. లక్షణాలు కనిపించి టెస్టులు చేయించుకోని వారు ఉంటే బయటకు వచ్చి టెస్టులు చేయించుకోవాలని చెప్పారు. మహారాష్ట్రలో నెలకొన్ని పరిస్థితిపై ఆదివారం ఆయన మాట్లాడారు. మే 3 తర్వాత జిల్లాల్లో సడలింపులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ఉద్ధవ్‌ థాక్రే చెప్పారు. బోర్డర్‌‌లు తెరవకుండా జిల్లా పరిధిలోనే కార్యకలాపాలు సాగే విధంగా నిబంధనలు సడలించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వలస కూలీలు ఎక్కడ గుమ్మిగూడ వద్దని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ను అందరూ కచ్చితంగా పాటిస్తేనే కరోనాను అడ్డుకోవచ్చు అని చెప్పారు. ఈ టైంలో రాజకీయాలు పక్కన పెట్టి కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామని, వలస కార్మికుల గురించి కేంద్రంతో చర్చిస్తున్నామని, వీలైనంత త్వరలో ఒక పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. కరోనాతో చనిపోయిన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. వచ్చే మూడు నాలుగు నెలలు చాలా ముఖ్యం అని అన్నారు. డాక్టర్లు క్లీనిక్‌లు స్టార్ట్‌ చేయాలని, డయాలసిస్‌ సెంటర్లు కూడా ఓపెన్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఈ నెల 30 తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై చర్చిస్తున్నామని, కొన్ని సడలింపులు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజల బాధ్యత తనపై ఉందని, ఇది సహనానికి పరీక్ష అని ఉద్ధవ్‌ థాక్రే చెప్పారు. అందరం కలిసి వైరస్‌ను పూర్తిగా నిర్మూలిద్దాం అని చెప్పారు. మన దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 7628 కేసులు నమోదు కాగా..వాటిలో అత్యధిక కేసులు ముంబైలోనే ఉన్నాయి.