సోనుసూద్ ను కలవడానికి 800కిమీ సైకిల్ యాత్ర

సోనుసూద్ ను కలవడానికి 800కిమీ సైకిల్ యాత్ర
  • సెల్ఫీ దిగితే చాలంటూ సైకిల్ యాత్ర చేపట్టిన నాగర్ కర్నూలు యువకుడు సురేష్

వికారాబాద్: సినిమాల్లో విలన్ నిజ జీవితంలో హీరో సోనుసూద్ ను కలిసేందుకు గతంలో ఒక యువకుడు పాదయాత్ర చేస్తే.. ఇప్పుడు మరో యువకుడు సైకిల్ యాత్ర చేపట్టాడు. సోనూసుద్ ను కలిసి ఓ ఫోటో దిగితే చాలు అంటూ సైకిల్ పై 800 వందల కిలోమీటర్ల దూరం ఉన్న ముంబై కి బయలుదేరాడు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సురేష్ అనే యువకుడు సోనూసుద్ ను కలిసేందుకు సైకిల్ పై 800 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాడు. తన యాత్రలో భాగంగా గురువారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి చేరుకున్నాడు. 
తలపై హెల్మెట్ ధరించి ఒక చిన్న బ్యాగు తీసుకుని రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఎలాగైనా సోనుసుద్ ను కలవాలనే సంకల్పంతో బయలుదేరిన సురేష్ పరిగి దగ్గర తనను కలసిన మీడియా వారితో మాట్లాడాడు. తన సోదరుడి సహకారంతో బయలుదేరిన తనకు మార్గం మధ్యలో సోనుసుద్ అభిమానులు కలిసి పండ్లు,బిస్కెట్లు, ఆహారం,నీళ్లు అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశాడు. సోనుసూద్ ను కలిసేందుకు తాను ఏమి ఆశించడంలేదని...ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభిమానిగా మారానని, కేవలం ఆయనపై తనకున్న అభిమానం వ్యక్తం చేస్తానని.. తన నిజజీవిత హీరో అయిన సోనుసూద్ తో సెల్ఫీ దిగితే చాలు..  తన జన్మ ధన్యమవుతుందని భావిస్తున్నట్లు సురేష్ తెలిపాడు.