బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ చిత్రం 'రామాయణ' (Ramayana). లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ మూవీపై అంచనాలను రెట్టింపు చేసింది.. అయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకే చర్చ నడుస్తోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించారు. అయితే ఈ ట్రైలర్లో కేవలం కొన్ని క్షణాల పాటు దర్శనమిచ్చిన మహావిష్ణువు పాత్ర ఇప్పుడు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఆ పాత్రలో కనిపించింది ఎవరు? అనే ప్రశ్నకు ఇప్పటివరకు చిత్రబృందం ఎలాంటి అధికారిక సమాధానం ఇవ్వకపోవడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి.
విష్ణుమూర్తి రూపం ఎవరిది?
ట్రైలర్ ప్రారంభంలోనే రావణుడు తాను త్రిలోకాల అధిపతినని ప్రకటించడం, అనంతరం అధర్మాన్ని అంతం చేసేందుకు మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించినట్లు చూపించిన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఆ క్షణాల్లో కనిపించిన విష్ణుమూర్తి రూపం ఎవరిదన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రధాన పేర్లలో మొదటిది.. టెలివిజన్ నటుడు సౌరభ్ రాజ్ జైన్. 'మహాభారత్' సీరియల్లో శ్రీకృష్ణుడిగా ఆయన నటనకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. ట్రైలర్లో కనిపించిన ముఖకవళికలు, రూపురేఖలు సౌరభ్ను పోలి ఉన్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
తెరపైకి మహేష్ బాబు పేరు?
మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో భారతీయ పురాణాల స్ఫూర్తితో రూపొందుతున్న ' వారణాసి' చిత్రంలో మహేష్ బాబు నటిస్తున్నారు. అందులో శ్రీరాముడి స్ఫూర్తితో కూడిన ప్రత్యేక ఎపిసోడ్లో కనిపిస్తారనే ప్రచారం ఇప్పటికే ఉంది. దీంతో 'రామాయణ'లోనూ విష్ణుమూర్తి పాత్రలో ఆయనే కనిపించారా? అనే చర్చ మరింత వేడెక్కింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
►ALSO READ | Ramayana: సాయి పల్లవి కంటే ముందు సీతగా మెప్పించిన హీరోయిన్లు.. ఆ పవిత్ర పాత్రకు జీవం పోసిన అందాల తారలు వీరే.!
కన్ఫూజన్ లో ఫ్యాన్స్..
ఇంకొందరు మాత్రం రణబీర్ కపూర్ నే విష్ణుమూర్తి పాత్రలో కూడా చూపించి ఉంటారని భావిస్తున్నారు. ఎందుకంటే శ్రీరాముడు మహావిష్ణువు అవతారం కావడంతో, రెండు రూపాల మధ్య విజువల్ కనెక్షన్ కోసం దర్శకుడు ఇదే నిర్ణయం తీసుకుని ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విష్ణుమూర్తి పాత్ర గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోవడంతో విజువల్స్ లో ఉంది.. మహేష్ బాబునా, రణబీర్ కపూరా,సౌరభ్ రాజ్ జైన్, లేక మరో స్టార్ హీరోనా? అన్న దానిపై ఫ్యాన్స్ లో కన్ఫూజన్ నెలకొంది.
దీపావళికి రిలీజ్..!
సుమారు 4వేల కోట్ల బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. తొలి భాగం దీపావళి 2026, రెండో భాగం దీపావళి 2027లో విడుదల కానుంది. అయితే అప్పటి వరకు ట్రైలర్లో కనిపించిన ఆ విష్ణుమూర్తి అసలు ఎవరు? అనే ప్రశ్న మాత్రం అభిమానులను వెంటాడుతూనే ఉండనుంది. చిత్రబృందం అధికారికంగా ఆ రహస్యాన్ని బయటపెట్టే వరకు ఈ మిస్టరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
