- ఇంట్రాడే హై నుంచి 450 పాయింట్లు పడిన నిఫ్టీ
- నిఫ్టీ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 3 శాతానికి పైగా డౌన్
- ప్రాఫిట్ బుకింగ్, పెరుగుతున్న కరోనా కేసులే కారణం!
ముంబై : బెంచ్ మార్క్ ఇండెక్స్లు బుధవారం సెషన్లో హయ్యర్ లెవెల్స్లో సస్టయిన్ కాలేకపోయాయి. ఇంట్రాడేలో 21,600 వరకు పెరిగి నిఫ్టీ, చివరికి 300 పాయింట్ల నష్టంతో 21,150 దగ్గర క్లోజయ్యింది. సెన్సెక్స్ 931 పాయింట్లు (1.31 శాతం) పడి 70,506 దగ్గర సెటిలయ్యింది. ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.9.1 లక్షల కోట్లు తగ్గింది. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు 3 శాతానికి పైగా పతనమయ్యాయి.
మార్కెట్ ఎందుకు పడిందంటే?
మార్కెట్ పడడానికి ప్రధాన కారణం ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపడమేనని ఎనలిస్టులు పేర్కొన్నారు. నాన్స్టాప్ ర్యాలీతో ఇండెక్స్లు ఓవర్బాట్లో ఉన్నాయని చెప్పారు. ఈ ఒక్క నెలలోనే నిఫ్టీ, సెన్సెక్స్ 5 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ 50 లో 46 షేర్లు బుధవారం నష్టాల్లోనే ముగిశాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 6 శాతం వరకు నష్టపోగా, టాటా స్టీల్, యూపీఎల్ 5 శాతం చొప్పున పడ్డాయి. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు ఇండియాలో పెరుగుతుండడంతో కూడా ట్రేడర్లు జాగ్రత్త పడుతున్నారని ఎనలిస్టులు అంచనావేశారు.
దేశంలో బుధవారం ఒక్క రోజే 614 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గ్లోబల్గా చూస్తే ఎర్ర సముద్రంలో షిప్పింగ్ రూట్స్కు అంతరాయం ఏర్పడడంతో కూడా మార్కెట్ పడింది. ‘ మధ్యాహ్నం సెషన్లో ఒక్కసారిగా సెల్లింగ్ వచ్చింది. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్గా ట్రేడయినా మన మార్కెట్ పడింది. తాజా ర్యాలీతో మిడ్, స్మాల్క్యాప్ షేర్ల వాల్యుయేషన్ పెరిగింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా తాజాగా క్రూడాయిల్ ధరలు పెరగడం కూడా మార్కెట్పై ప్రభావం చూపింది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు.
సెక్టార్లన్నీ నష్టాల్లోనే
అన్ని సెక్టార్ల ఇండెక్స్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. మిడ్, స్మాల్క్యాప్ షేర్లయితే భారీగా పడ్డాయి. ‘గత 12 వారాల్లో 12 శాతం వరకు పెరిగిన బెంచ్మార్క్ ఇండెక్స్లు బుధవారం భారీగా పడ్డాయి. సమీప భవిష్యత్లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందని అంచనావేస్తున్నాం. ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కొనసాగుతుంది. మరోవైపు దేశంలో ముఖ్యంగా కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో మార్కెట్ మరింత పడే ఛాన్స్ ఉంది’ అని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్ధ ఖేమ్కా పేర్కొన్నారు.
ప్రస్తుత మార్కెట్పై బుల్లిష్గా ఉన్నామని, కొంత కాలం కన్సాలిడేషన్ తర్వాత ఇండెక్స్లు పెరుగుతాయని అన్నారు. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండడం, వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ ఉండడం, దేశ ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండడంతో ఇండెక్స్లు రికవరీ అవుతాయని వెల్లడించారు. ఇండివిడ్యువల్ షేర్లలో హిందుస్తాన్ కన్స్ట్రక్షన్, స్పైస్జెట్, మ్యాన్ ఇండస్ట్రీస్, డిష్టీవీ,ఎంటీఎన్ఎల్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, టెక్స్మాకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి స్మాల్ క్యాప్ షేర్లు బుధవారం 9–20 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ మెటల్, పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్లు 4 శాతం చొప్పున, నిఫ్టీ మీడియా ఇండెక్స్ 5 శాతం పడ్డాయి. యాక్సెంచర్ రిజల్ట్స్ మెప్పించకపోవడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ వరుసగా రెండో సెషన్లోనూ నష్టపోయింది.
ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీఓ పూర్తి సబ్స్క్రిప్షన్..
ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీఓ మొదటి రోజే పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ షేర్లు 1.36 రెట్లు సబ్స్క్రిప్షన్ సాధించాయి. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం, కంపెనీ ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా 1,01,22,705 షేర్లను అమ్మకానికి పెట్టింది. బుధవారం 1,37,98,260 షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి. ఆజాద్ ఇంజినీరింగ్ షేర్లు రూ. 499 – రూ. 524 రేంజ్లో అందుబాటులో ఉన్నాయి. ఐపీఓ మొదటి రోజు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 2 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 1.8 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి.
డొమ్స్ బంపర్ బోణి
డొమ్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఇష్యూ ధర రూ. 790 కంటే 68 శాతం ఎక్కువకు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. బీఎస్ఈలో రూ. 1,400 దగ్గర బోణి చేశాయి. ఇంట్రాడేలో మరో 10 శాతం ర్యాలీ చేసి రూ. 1,434 వరకు పెరిగాయి. చివరికి రూ.1,331 దగ్గర క్లోజయ్యాయి.
షార్ట్ టెర్మ్లో నెగెటివ్..
మార్కెట్ భారీగా పడడంతో షార్ట్ టెర్మ్లో నెగెటివ్ ట్రెండ్ కొనసాగుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. నవంబర్ నుంచి నాన్స్టాప్గా పెరగడంతో మార్కెట్ పడడం సహజమేనని వెల్లడించారు. నిఫ్టీ 20,700 దిగువకు వచ్చేంత వరకు బుల్లిష్ ట్రెండ్ రివర్స్ అయ్యిందని చెప్పలేమని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. కన్సాలిడేషన్ పీరియడ్లో క్వాలిటీ షేర్లను కొనుక్కోవాలని సలహా ఇచ్చారు. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో సెల్లింగ్ ప్రెజర్ కొనసాగొచ్చని చెప్పారు.