
హైదరాబాద్, వెలుగు: మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 15 నెలల్లో 97 వేల ఫోన్స్ను రికవరీ చేశారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూలై 25 వరకు 21,193 సెల్ఫోన్స్ రికవరీ చేసి మరోసారి ప్రతిభ చూపారు. రికవరీలో కర్నాటక మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ సెకండ్ ప్లేస్లో నిలిచింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీవోటీ) సీఈఐఆర్ పోర్టల్తో కలిసి రాష్ట్ర పోలీసులు చేస్తున్న మొబైల్ సెర్చింగ్ వివరాలను సీఐడీ చీఫ్ శిఖాగోయల్ ఆదివారం వెల్లడించారు. సీఈఐఆర్ పోర్టల్ను రాష్ట్రంలో గత ఏడాది ఏప్రిల్ 19 నుంచి ప్రారంభించారు.
హైదరాబాద్లోనే అత్యధికం..
రాష్ట్రంలోని 780 పోలీస్ స్టేషన్లు ఈ పోర్టల్ను ఉపయోగిస్తున్నాయి. ఈ ఏడాది 206 రోజుల్లోనే 21,193 పోగొట్టుకున్న, దొంగిలించిన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. గత 8 రోజుల్లో 1000 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ప్రతిరోజు సగటున 82 మొబైల్లను రికవరీ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా3808, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2,174, సైబరాబాద్ 2,030 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశారు.