
ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినేట్ లో 99 శాతం కోటీశ్వరులే ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. 71 మందిలో 70 మంది కోటీశ్వరులేనని వెల్లడించింది. మంత్రుల సగటు ఆస్తి రూ.107.94 కోట్లని వెల్లడించింది. మంత్రుల్లో ఆరుగురు రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నారని తెలిపింది. రూ.5705.47 కోట్ల విలువైన ఆస్తులతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల్లో రూ.5598.65 కోట్లు చరాస్తులు, రూ.106.82 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రెండో స్థానంలో ఉన్నారు.
ఇక 39 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. మంత్రుల్లో 11 మంది విద్యార్హత 12వ తరగతి మాత్రమే కాగా 57 మంది (80%) మంత్రుల విద్యార్హత గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా జూన్ 09వ తేదీ ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా, 71 మంది కేంద్రమంత్రులు, సహాయమంత్రులుగా (ఐదుగురు స్వతంత్ర హోదా) ప్రమాణస్వీకారం చేశారు.