
సంక్రాంతి వచ్చిందంటే చాలు బోగి మంటలు వేస్తుంటారు. ఇంట్లోని పనికిరాని సామాన్లను బయటపడేసి నిప్పు పెడుతుంటారు. మరి, ఎప్పుడైనా క్రిస్మస్ మంటల గురించి విన్నారా? అమెరికాలోని లూసియానాలో 1700వ సంవత్సరం నుంచి అది ఆచారంగా వస్తోంది. అయితే, కొన్నాళ్లపాటు అది మరుగున పడిపోయినా, లూసియానా రాష్ట్రంలోని గ్యారీవిల్లీకి చెందిన జోస్ వైడర్ట్ అనే యువకుడి ఆధ్వర్యంలోని టీం ఆ ఆచారాన్ని కొనసాగిస్తోంది. ఏటా రకరకాల రూపాల్లో బొమ్మలను తయారు చేసి క్రిస్మస్ మంటలను పెడుతోంది. ఈ ఏడాది 78 అడుగుల పెద్ద మొసలి (ఎలిగేటర్)ని తయారు చేసింది.
క్రిస్మస్ పండుగ రోజు సాయంత్రం 7 గంటలకు దానిని కాల్చేందుకు రెడీ అవుతోంది. ఈ బొమ్మలను తయారు చేసేందుకు ఎండిపోయిన చెట్ల కర్రలను వాడుకుంటోంది. అవసరమైన పర్మిషన్లనూ తీసుకుంటోంది. ఎలిగేటర్ బొమ్మను తయారు చేయడానికి 21 రోజులు పట్టిందట. డిసెంబర్ 18న దాని నిర్మాణం పూర్తి చేశారట. ఏటా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారని జోస్ చెబుతున్నాడు. పాపా నోయెల్ (కజున్ తెగ వాళ్లు నమ్మే శాంటా క్లాజ్)కు వెల్కమ్ చెప్పేందుకే ఈ మంటలని కజున్స్ తెగ ప్రజలు నమ్మకమట. పిల్లలకూ అదే స్టోరీ చెబుతారట. అయితే, 1700 సంవత్సరంలోలో జర్మనీ, ఫ్రాన్స్ నుంచి వచ్చిన జనాలే ఈ ఆచారాన్ని తీసుకొచ్చారని రివర్ పరిషెస్ టూరిస్ట్ కమిషన్ చెబుతోంది.