జనరేటర్​ సాయంతో గాంధీ వార్డులకు నీరు

జనరేటర్​ సాయంతో గాంధీ  వార్డులకు నీరు
  • ఆస్పత్రిలో నీటి సమస్యపై సూపరింటెండెంట్ సమావేశం
  • ‘వెలుగు’ కథనానికి స్పందన

పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలోని పేషెంట్ల వార్డులు, వాష్​రూమ్స్, ఆపరేషన్​థియేటర్లకు జనరేటర్​సాయంతో తాత్కాలికంగా నీరు సరఫరా చేస్తున్నారు. హే గాంధీ.. ఏందీ యాతన? శీర్షికన ఆదివారం వెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించి, చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్​రాజకుమారి అసిస్టెంట్​ డైరెక్టర్, ఆర్ఎంవోలు, అధికారులతో నీటి సరఫరా నిలిచిపోయిన అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించారు.

 సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘వెలుగు’తో మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రి పంప్​హౌస్​లోని పవర్ కేబుల్​డ్యామేజ్ అవడంతో నీటి సరఫరా కు అంతరాయం కలిగిందన్నారు. ప్రస్తుతం పంప్​హౌజ్​వద్ద ఏర్పాటు చేసిన జనరేటర్ సాయంతో వార్డులకు నీరందిస్తున్నామని, అదనంగా మరో జనరేటర్ కూడా పెట్టబోతున్నామని తెలిపారు. అండర్ గ్రౌండ్ నుంచి వెళ్లే పవర్​కేబుల్​ను మార్చాల్సి ఉందని, సివిల్ వర్క్స్​కూడా చేయాల్సి ఉన్నందున కొద్ది రోజుల్లో సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. పేషంట్లతోపాటు వారి సహాయకులకు, వైద్య విభాగాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.