- రూ.8.5 కోట్లు కొట్టేసిన బ్యాంకు డిప్యూటీ మేనేజర్
నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లాలో తాను పనిచేస్తున్న బ్యాంకుకే కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టాడు డిప్యూటీ మేనేజర్. ఏకంగా రూ.8.5 కోట్ల కస్టమర్ల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆడి పోలీసులకు దొరికిపోయాడు. వరంగల్ సిటీకి చెందిన బైరిశెట్టి కార్తీక్ నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే ఆడిటింగ్ అధికారులు బ్యాంకు లావాదేవీలను తనిఖీ చేయగా 8.5 కోట్ల రూపాయలు తేడా ఉన్నట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం బ్యాంకు రీజనల్ మేనేజర్ ఓరుగుంటి శ్రీనివాస్ నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో 18 నెలలుగా కొనసాగుతున్న తన బాగోతం బయటపడడంతో డిప్యూటీ మేనేజర్ కార్తీక్ పరారయ్యాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నిందితుడు అసలు విషయం చెప్పాడు. కస్టమర్ల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆడానని కార్తీక్ ఒప్పుకున్నాడు. అతనితో పాటు మరికొంత మంది పాత్రపైనా ఆరా తీస్తున్నామని టౌన్ సీఐ సుంకరి రవికుమార్ తెలిపారు.