ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వంశీకృష్ణ

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వంశీకృష్ణ
  • చెన్నూరు ను మోడల్ నియోజకవర్గంగా మార్చుతా
  • భారీ మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి చేస్తడు
  • ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కోల్ బెల్ట్/చెన్నూరు, వెలుగు : చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం చెన్నూరులోని ఆదర్శ్​నగర్​లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. చీఫ్​ గెస్ట్​గా హాజరైన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డితో కలిసి మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఆదర్శ్ నగర్ నుంచి ఎక్కువ ఓట్లు వచ్చాయని, తనకు ఇచ్చిన మెజార్టీకి డబుల్ వంశీకృష్ణకు ఇవ్వాలన్నారు. 1953లో చెన్నూరు నుంచి మొదటిసారి కాకా వెంకటస్వామి  పోటీ చేశారని, పెద్దపల్లి ప్రజలు నాలుగు సార్లు కాకాను ఎంపీగా గెలిపించిన విషయాన్ని గుర్తుచేశారు. 

సుమన్​పై పోరు కోసం నన్ను గెలిపించారు

బాల్క సుమన్ అహంకారం, ఇక్కడ రౌడీ రాజకీయం మీద పోరు కోసమే ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని వివేక్​ వెంకటస్వామి అన్నారు. సుమన్ ప్రజలను పట్టించుకోలేదని, సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. చెన్నూరు ప్రజలు ఇచ్చిన దమ్ముతో ఎమ్మెల్యేగా నిలబడ్డానని.. 23 రోజుల ప్రచారంలో 37,189 ఓట్ల మెజార్టీ ఇచ్చి ప్రజలు తనను ఆదరించి

సుమన్​కు గట్టి బుద్ధి చెప్పారని అన్నారు. తాను ఎంపీగా ఉన్నపుడు తాగు నీరు, రోడ్లకు రూ. 800 కోట్ల నిధులు మంజూరు చేశానన్నారు. సీపీఐ, సీపీఎం పార్టీలు, మాల సంఘం జేఏసీ, నేతకానీలు వంశీకృష్ణకు సపోర్ట్ చేస్తున్నాయన్నారు.

కాంగ్రెస్​లో పలువురి చేరిక

చెన్నూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ సందర్భంగా కాంగ్రెస్​లో చేరారు. వారికి వివేక్ వెంకటస్వామి, పురాణం సతీశ్, మూల రాజిరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

చెన్నూర్​లో త్వరలోనే స్కిల్​ డెవలప్​మెంట్ ​సెంటర్​

అసెంబ్లీ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం మందమర్రిలో స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్​ను ప్రారంభించామని, త్వరలోనే చెన్నూరులో అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే వివేక్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూస్తున్నట్లు చెప్పారు. ఒత్కుల్లపల్లి రైతులు పంట పొలాలకు నీరు కావాలని కోరిన వెంటనే ఏఈతో మాట్లాడి గొల్ల వాగు ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.

జైపూర్​లో సింగరేణి పవర్ ప్లాంట్ ఏర్పాటు, రామగుండంలో ఫర్టిలైజర్ సంస్థను రీ ఓపెన్ చేయించినట్లు చెప్పారు. బీజెపీ అభ్యర్థి కేవలం ఎలక్షన్ల సమయంలోనే ఇక్కడ తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. వంశీకృష్ణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడన్నారు.