కూతురు ఆడుకుంటోంది అనుకుంది.. రక్తపు మడుగులో పసిపాపను చూసి కుప్పకూలిన తల్లి

కూతురు ఆడుకుంటోంది అనుకుంది.. రక్తపు మడుగులో పసిపాపను చూసి కుప్పకూలిన తల్లి

బెంగుళూరులోని నయనదహళ్లిలో జరిగిన ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. పసిపాప ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే, ఆ తల్లి పడుతున్న ఆవేదన వర్ణనాతీతం.పాప ఆడుకుంటోంది కదా అన్న ధీమా ఆమెది. అయితే ఆ పసిపాప అడుగులు మృత్యువు వైపు సాగుతాయని ఆమె ఊహించలేదు. ఆడుకుంటూ వెళ్లిన ఆ చిన్నారి, మేడపై నుంచి అదుపుతప్పి కింద పడిపోవడంతో ఆ తల్లి ప్రపంచమే ఒక్కసారిగా చీకటిమయమైంది. వివరాల్లోకి వెళితే..

పశ్చిమ బెంగళూరులోని నయనదహళ్లిలో ఓ నివాస భవనం మొదటి అంతస్తు నుంచి పడి ఒకటిన్నర ఏళ్ల బాలిక సహానాకు తీవ్రగాయాలయ్యాయి. సోమవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తో ఆ ప్రాంతమంతా దిగ్భ్రాంతికి గురైంది. బాలిక పైనుంచి పడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 

పాప ఆడుకుంటోంది కదా అన్న ధీమాతో తల్లి వంటగదిలో పనిచేసుకుంటుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఆ పాప తెరిచి ఉన్న మెయిన్ డోర్ ద్వారా బాల్కనీలోకి వచ్చింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, సహానా కారిడార్‌లోని ఓ మెటల్ గ్రిల్ దగ్గర ఉన్న కుర్చీపైకి ఎక్కింది. ఆమె అదుపుతప్పి మొదటి అంతస్తు నుండి కింద రోడ్డుపై పడిపోవడంతో, తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే  కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు.

బిడ్డ జీవచ్ఛవం లా పడి ఉండటం చూసి ఆ ఒక్కసారిగా షాక్ కు గురై స్పృహ కోల్పోయింది.  స్థానికులు వెంటనే స్పందించి తల్లినీ, పాపనూ అత్యవసర చికిత్స కోసం బసవనగుడిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.సహానా ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు ప్రకటించారు. 

ఈ ఘటనపై స్పందించిన స్థానిక నేతలు పాప చికిత్స అయ్యే ఖర్చును తాము భరిస్తామని ముందుకు వచ్చారు. ఇలాంటి విషాదకరమైన ప్రమాదాలను నివారించడానికి, ముఖ్యంగా బాల్కనీలు, కారిడార్లు, బహిరంగ ప్రదేశాలకు భద్రత కల్పించడం వంటి పిల్లల భద్రతా చర్యల ప్రాముఖ్యతను ఈ సంఘటన మరోసారి నొక్కి చెప్పింది.