
గోదావరిఖని, వెలుగు : సింగరేణి కార్మికులు అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి పథకాన్ని వెంటనే అమలు చేయాలని జేబీసీసీఐ మెంబర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక శ్రామిక భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయూస్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామన్నారు. ఈ స్కీమ్ను అమలు చేస్తామని సింగరేణి ఎన్నికలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల టైంలో కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
ఈ పథకంతో సింగరేణి కార్మికులతో పాటు మేనేజ్మెంట్కు, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం లాభం కలుగుతుందన్నారు. కార్మికులు పొందుతున్న పెర్స్క్ మీద ఇన్కం ట్యాక్స్ను అమలు చేయాలంటే ఒక్కో కార్మికుడికి రూ.ఆరు వేల వరకు ఖర్చు అవుతుందని, వాటర్, కరెంట్ రిపేర్ల పేరుతో ప్రతి నెల రూ.ఐదు వేలు పే చేసే భారం తగ్గుతుందన్నారు.