
- హోటల్ సిబ్బంది ఆరుగురు అరెస్ట్
- హైదరాబాద్లోని అబిడ్స్లో ఘటన
బషీర్ బాగ్, వెలుగు : బిర్యానీ సరిగ్గా ఉడకలేదని నిలదీసిన కస్టమర్లపై ఓ హోటల్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్లోని అబిడ్స్ లో జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా 31వ తేదీ అర్ధరాత్రి ధూల్పేట్కు చెందిన కొందరు కుటుంబసభ్యులతో కలిసి అబిడ్స్ జీపీవో వెనుక ఉన్న గ్రాండ్ హోటల్కు వెళ్లారు. మటన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా వెయిటర్ వడ్డించాడు. అయితే బిర్యానీ సరిగ్గా ఉడకలేదని తమకు డిస్కౌంట్ ఇవ్వాలని వెయిటర్ను ఫ్యామిలీ మెంబర్స్ కోరారు. దీంతో కస్టమర్లకు, హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వావాదం జరిగింది.
మొదట ఓ కస్టమర్ వెయిటర్పై దాడి చేశాడు. దాంతో వెయిటర్స్ అందరూ కలిసి కస్టమర్లపై ఎదురు దాడికి దిగారు. హోటల్లో ఉన్న కట్టెలు, పైపులు, వంట సామగ్రితో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఈ ఘటనలో మహిళలతో పాటు పలువురికి గాయాలయ్యాయి. దాంతో బాధితులు హోటల్పై, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. నిబంధనలు పాటించని హోటల్ను మూసి వేయాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉడకని బిర్యాని వడ్డించడంతో పాటు ఇదేమని ప్రశ్నించినందుకు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 9 మంది దాడికి పాల్పడినట్లు గుర్తించారు. అందులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని.. త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.