
మేడిపల్లి, వెలుగు: ప్రభుత్వ శాఖల్లో అధికారిగా చెప్పుకుంటూ ప్రైవేటు దవాఖానలు, విద్యాసంస్థల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మహ్మద్ ఓజియార్ అలియాస్ అర్జున్(36) ఘట్ కేసర్ మండలం కాచవానిసింగారం మణిదీప కాలనీలో నివాసముంటూ ప్రవేట్ జాబ్ చేస్తున్నాడు.
కొన్నాళ్ల నుంచి నగరంలోని పలు ప్రైవేట్విద్యాసంస్థలు, హాస్పిటళ్ల వద్దకు వెళ్లి జీహెచ్ఎంసీ, ఎంహెచ్ఏ, ఫైర్ డిపార్ట్మెంట్కు చెందిన అధికారిగా చెప్పుకుంటున్నాడు. అనుమతి పత్రాలు, ఎన్వోసీ లేవని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు.
గురువారం మేడిపల్లిలోని ప్రజ్వల హాస్పిటల్కు వెళ్లి అనుమతి పత్రాలు లేవని డబ్బులు డిమాండ్ చేశాడు. వారు మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహ్మద్ ఓజియార్ ను అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ అసోసియేషన్ ఉప్పల్ అధ్యక్షుడు డాక్టర్ కె.అశోక్ కుమార్, ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో కూడా నిందితుడిపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.