
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని ఫలక్ నుమాలో కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. పాత రోడ్ ఓవర్ బ్రిడ్జికి సమాంతరంగా మరో రోడ్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. రేపు (శుక్రవారం) ఉదయం 9 గంటలకు ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. 52 కోట్ల 3 లక్షల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం జీహెచ్ఎంసీ పూర్తి చేసింది. 360 మీటర్ల పొడవుతో రెండు లైన్ల నిర్మాణం.. బార్కాస్ జంక్షన్ నుంచి ఫలక్ నుమా బస్ డిపో వరకు ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. రైల్వే ట్రాక్పై నిర్మించిన పాత ఆర్ఓబీకి సమాంతరంగా అందుబాటులోకి వచ్చిన మరో ఆర్ఓబీ ఇది కావడం గమనార్హం. మొదట నిర్మించిన ఆర్ఓబీ కేవలం రెండు లైన్లు మాత్రమే ఉండడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో రెండు లైన్లను బల్దియా నిర్మించింది.
ఇదిలా ఉండగా.. అంబర్పేట, దిల్సుఖ్నగర్ ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ పాత బ్రిడ్జి ప్రస్థానం ఇక ముగిసినట్టే. ఇక్కడ ఇప్పటికే ఓవైపు కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా, పాత బ్రిడ్జి ఇటీవల వచ్చిన భారీ వరదలకు కోతకు గురైంది. దీంతో పటిష్టతను పరిశీలించిన జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ఈ బ్రిడ్జికి రిపేర్లు కాకుండా దీని స్థానంలో కొత్తది నిర్మిస్తేనే మంచిదని నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చిలోపు కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని, అప్పటివరకు రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం కోతకు గురైన బ్రిడ్జి పనులను కూడా వెంటనే ప్రారంభించి జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు తెలిసింది.