మునగాల వద్ద రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

మునగాల వద్ద  రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రం శివారులోని పెట్రోల్ బంకు దగ్గర అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, లారీ ఢీ కొనడంతో ఐదుగురు చనిపోయారు.మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సాగర్ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో రాత్రి మహాపడి పూజకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో  ట్రాక్టర్ లో  38 మంది  ఉన్నారు. తన్నీరు ప్రమీల, చింతకాయల ప్రమీల, ఉదయ్ లోకేశ్ స్పాట్ లోనే చనిపోయారు. హాస్పిటల్ కు తీసుకెళ్తండగా మధ్యలో  నారగోని కోటయ్య, చికిత్స పొందుతూ గండు జ్యోతి మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న కోదాడ, సూర్యాపేట, ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.