చిత్తూరు జిల్లా తిరుచానూరులో దారుణం జరిగింది. నవమాసాలు మోసి, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అని తెలియడంతో ఓ కర్కశ తల్లి నిర్ధాక్షిణ్యంగా ఆ పసికందుని వదిలేసి వెళ్ళిపోయింది. తిరుచానారు పీఎస్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. తిరుచానూరు ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఓ మహిళ ప్రసవం అనంతరం తన కన్నబిడ్డను తిరుచానూరు పాత బస్టాండ్ దగ్గరున్న భాషా చికెన్ సెంటర్ సమీపంలో వదలి వెళ్ళిపోయింది. కాసేపటికి ఆ ప్రదేశంలో పసికందు ఏడుపు వినిపించడంతో చుట్టుపక్కన ఉన్న వాళ్లు ఆ పురిటి బిడ్డను స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులకు తెలిపింది. పోలీసులు ఆ బిడ్డను శిశు సంరక్షణ సమితికి అప్పగిస్తామని తెలిపారు.