ఆస్తి కోసం మామను చంపిన అల్లుడు

ఆస్తి కోసం మామను చంపిన అల్లుడు
  • ఎకరం భూమి ఇస్తానని.. ఇవ్వలేదనే కోపంతోనే..
  • నాగర్​కర్నూల్​ జిల్లా మర్రిపల్లిలో ఘటన

ఉప్పునుంతల, వెలుగు :  నాగర్​కర్నూల్​ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఆస్తి కోసం ఓ అల్లుడు మామను చంపాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మర్రిపల్లికి చెందిన సొనమోని వెంకటయ్య(55) తన కూతురిని ఉప్పునుంతలకు చెందిన గడ్డం సాయిబాబుకు ఇచ్చి పెండ్లి చేశాడు.  కట్నం కింద ఎకరం భూమి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. మాట నిలబెట్టుకోకపోవడంతో పలుమార్లు గొడవలు జరిగాయి.

ఈ విషయమై శుక్రవారం రాత్రి అత్త కలమ్మతో గొడవపడిన సాయిబాబు ఆమెను చంపుతానని తరమగా తప్పించుకొని ఇంట్లోకి వెళ్లి గొళ్లెం పెట్టుకుంది. మామ పొలంలో ఉండడంతో అక్కడకు వెళ్లిన సాయిబాబు అతడిని రాయితో  కొట్టాడు. దీంతో వెంకటయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పక్కనే ఉన్న రైతులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వెంకటయ్యను దవాఖానకు తరలించేలోపే  చనిపోయాడు. తర్వాత సాయిబాబు పీఎస్​కు వెళ్లి లొంగిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గురుస్వామి తెలిపారు.