చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్– బీజాపూర్ హైవేపై మరో ప్రమాదం జరిగింది. ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగి 19 మంది చనిపోయిన సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే టిప్పర్ చెట్టును ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. హైవే పనుల కోసం గురువారం చేవెళ్ల మండలం అంతారం నుంచి మట్టిని నింపుకొని వస్తున్న టిప్పర్ ఖానాపూర్ స్టేజీ వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వడ్డె శ్రీరామ్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్ను జేసీబీ ద్వారా పక్కకు జరిపి.. డ్రైవర్ను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
