
- టెక్సస్ డెయిరీ ఫాంలో భారీ పేలుడు
- 18 వేల ఆవులు మృత్యువాత.. వాటి విలువ రూ.300 కోట్లు
- యంత్రాల ఓవర్ హీట్ వల్లే ప్రమాదం
టెక్సస్ : టెక్సస్ లోని ఓ డెయిరీ ఫాంలో భారీ పేలుడు సంభవించింది. దిమ్మిట్ లోని సౌత్ ఫోర్క్ డెయిరీలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఈ ఫాంలోని 18 వేల ఆవులు మృత్యువాత పడ్డాయి. సిబ్బందిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి మంటలు, పొగ భారీగా ఎగిసిపడ్డాయి. ఫాంలోని యంత్రాలు వేడెక్కడం వల్లే ఈ పేలుడు జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన ఆవుల విలువ 36 మిలియన్ డాలర్ల(దాదాపురూ.300 కోట్లు) పైనే ఉంటుందని ఎనిమల్ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. డైరీ ఫాంలోని యంత్రాలు, నిర్మాణాలు కూడా నాశనమయ్యాయని, వాటి విలువ ప్రస్తుతానికి అంచనా వేయలేమని చెప్పారు. డెయిరీ ఫాం చరిత్రలోనే ఈ స్థాయిలో ఆవుల ప్రాణనష్టం జరగలేదని ఎనిమల్ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది.
స్థానికుల విచారం..
ఇది ఫ్రాంక్ బ్రాండ్డెయిరీస్ కు చెందిన డెయిరీ ఫాం అని అధికారులు తెలిపారు. ఈ వారం మొదట్లో పేలుడు జరిగిందని, గాయపడ్డ మహిళా కార్మికురాలు ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉందని వివరించారు. కాగా, పేలుడు జరిగిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని డెయిరీ ఫాం దగ్గర్లోని దిమ్మిట్ కౌంటీ ( గ్రామం) వాసులు తెలిపారు. డెయిరీ ఫాం ఉన్న చోట పొగ ఎగిసిపడడం చాలా దూరం నుంచే కనిపించిందని చెప్పారు. ఫాం ధ్వంసం కావడంతో తమకు ఉపాధి పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.