అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలి బూడిదైన హైదరాబాద్ కొంపల్లి ఫ్యామిలీ

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలి బూడిదైన హైదరాబాద్ కొంపల్లి ఫ్యామిలీ

జీడిమెట్ల, వెలుగు: అమెరికాలోని డల్లాస్‌‌లో జరిగిన  రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌‌కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. వీరు ప్రయాణిస్తున్న కారును రాంగ్​రూట్​లో వచ్చిన మినీ ట్రక్కు ఢీకొట్టడంతో.. మంటలు చెలరేగి ఇద్దరు పిల్లలుసహా దంపతులు కాలి బూడిదయ్యారు. ఈ ఘటన అమెరికాలోని గ్రీన్ కౌంటీ ఏరియాలో  జరిగింది.

కొంపల్లిలోని ఎన్‌‌సీఎల్​నార్త్​ కాలనీకి చెందిన రవి, అనిత దంపతుల కూతురు తేజస్వినికి  మనోహరాబాద్‌‌కు చెందిన వెంకట్తో వివాహమైంది. వీరికి పాప, బాబు ఉన్నారు.  మూడేండ్ల క్రితం వీరి కుటుంబం అమెరికాకు వెళ్లింది. సాఫ్ట్‌‌వేర్ ​జాబ్ చేస్తూ డల్లాస్‌‌లో నివాసముంటున్నారు. కాగా, సెలవులు కావడంతో వెకేషన్ ​కోసం కారులో అట్లాంటా వెళ్లారు. తిరిగి డల్లాస్​ వస్తుండగా గ్రీన్​కౌంటీ​ఏరియాలో వీరి కారును రాంగ్​రూట్లో వచ్చిన మినీ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి.

తేజస్విని, వెంకట్‌‌తోపాటు వారి పాప, బాబు మంటల్లో  చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే టెక్సస్​పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయినా, వీరిని రక్షించడం సాధ్యం కాలేదు. మినీ ట్రక్ డ్రైవర్ రాంగ్ రూట్‌‌లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ట్రక్ డ్రైవర్‌‌‌‌ను గుర్తించేందుకు , అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్‌‌తోపాటు ఇతర ఆధారాలను సేకరించే  పనిలో పడ్డారు.  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం కావడంతో కొంపల్లిలోని తేజస్విని నివాసంలో విషాదఛాయలు నెలకొన్నాయి.  తమ కూతురు ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.