- పాస్ బుక్ కోసం వచ్చిన రైతును డిమాండ్ చేసిన గుట్ట తహసీల్దార్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో తహసీల్దార్ శోభన్ బాబు ఏకంగా ఆఫీసులోనే ఓ రైతును రూ.5 వేలు లంచం అడుగుతున్న వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుట్టకు చెందిన ఓ రైతు తన ఎకరం భూమిని యాదగిరిగుట్టకే చెందిన మరో రైతుకు అమ్మి రెండు రోజుల కింద తహసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించాడు. భూమిని కొన్న సదరు రైతు పట్టా పాస్ బుక్ కోసం అఫీసులో తహసీల్దార్ శోభన్ బాబును కలిశాడు. ఎన్ని ఎకరాల భూమి కొన్నావని రైతుతో మాటలు ప్రారంభించిన తహసీల్దార్.
పాస్ బుక్ కోసం రూ.5 వేలు కావాలని డైరెక్టుగానే అడిగాడు. దీనికి రైతు ‘సార్, మేము లోకల్ వాళ్లమై ఉండి కూడా రూ.5 వేలు ఇవ్వాలా’ అని అడగ్గా.. దీనికి తహసీల్దార్ ‘మాకు ప్రొటోకాల్, ఇంకా వేరే ఖర్చులుంటాయి కదా..రూ.5 వేలు ఇవ్వాల్సిందే’ అని తేల్చి చెప్పాడు. దీంతో రైతు పాస్ బుక్ తీసుకోకుండానే వెనుదిరిగాడు. ఇదంతా రైతు తన ఫోన్ లో రికార్డు చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై రైతును ‘వెలుగు’ సంప్రదించగా తహసీల్దార్ రూ.5 వేలు లంచం అడిగింది నిజమేనని, మొదట తహసీల్దార్ కాకుండా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారని చెప్పాడు. దీంతో నేరుగా తహసీల్దార్ శోభన్ బాబునే కలిసి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ గానే ఉన్నా డబ్బులు ఎందుకివ్వాలని అడిగితే ప్రొటోకాల్ ఖర్చుల కోసం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడని తెలిపాడు.