ఆంధ్రప్రదేశ్లో ఓ వ్యక్తి తన రిక్వెస్ట్ను వెరైటీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. వైన్ షాపుల్లో కూలింగ్ బీర్లు, రెగ్యులర్గా అందుబాటులో ఉండే లిక్కర్ బ్రాండ్లు దొరక్కపోవడంతో ఆ సమస్య తీర్చాలంటూ ఓ ఓటరు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు. అయితే దీనికి ఓటింగ్ను మార్గంగా ఎంచుకున్నాడు. ఏప్రిల్ నెలలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటింగ్లో బ్యాలెట్ పేపర్తో పాటు తన వినతిని ఒక స్లిప్పై రాసి అందులో వేశారు. అయితే ఈ ఎన్నికలపై పలు కోర్టు విచారణల తర్వాత ఎట్టకేలకు ఇవాళ (ఆదివారం) కౌంటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆ మద్యం ప్రియుడి స్లిప్ బయటపడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో జరిగింది.
అనంతపురం జిల్లా నల్లచెరువుకు సంబంధించిన కౌంటింగ్ చేస్తుండగా బ్యాలెట్ బాక్సులో ఓట్లతో పాటు ఓ స్లిప్ అధికారులకు కనిపించింది. అందులో ‘‘నల్లచెరువు వైన్ షాపుల్లో కూలింగ్ బీర్లు పెట్టాలని కోరుతున్నాము. అలాగే షాపుల్లో మంచి బ్రాండ్లు పెట్టాలి.. ఇట్లు నల్ల చెరువు యువత (మందుబాబుల అధ్యక్షులు)” అని రాసి ఉంది. ఈ పేపర్ను చూసి కౌటింగ్ సిబ్బంది అంతా నవ్వుకున్నారు. దాని తమ అధికారులు ఇచ్చామని వాళ్లు చెబుతున్నారు.