- మతిస్థిమితం సరిగా లేక అంత్యక్రియలు చేయని కుటుంబసభ్యులు
- ఇంట్లో నుంచి వాసన వస్తుండటంతో పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
- మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ఘటన
జీడిమెట్ల, వెలుగు: అనారోగ్యంతో మహిళ చనిపోగా, ఆమె డెడ్బాడీని ఓ కుటుంబం వారం రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకుంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ముక్కు ప్రవీణ్ కుమార్ (33) కుత్బుల్లాపూర్లోని చింతల్లో నివాసం ఉంటున్నాడు. గతంలో ఈయన ఓ ఫార్మా కంపెనీలో పని చేయగా, ప్రస్తుతం జాబ్ మానేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు.
ప్రవీణ్తో పాటు అతని తల్లి విజయలక్ష్మి, అక్క రాధా కుమారి (45) ఆయనతో కలిసి ఉంటున్నారు. కాగా, వారం రోజుల కింద ప్రవీణ్ సిస్టర్ రాధా కుమారి అనారోగ్యంతో చనిపోయింది. అయితే, తల్లి విజయలక్ష్మి, సోదరుడు ప్రవీణ్ కుమార్కు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో రాధాకుమారి చనిపోయిందన్న విషయం తెలుసుకోలేకపోయారు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించకుండా వారం రోజుల పాటు ఆమె మృతదేహన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు.
ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించగా, అప్పటికే రాధా కుమారి డెడ్బాడీ కుళ్లిపోయి, పురుగులు పట్టింది. అనంతరం పోలీసులు ఆమె మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.