ఐసీయూలో చికిత్సపై వైద్యులకు వర్క్షాప్
బషీర్బాగ్, వెలుగు : ఐసీయూలో రోగి ప్రాణాలు ఎలా కాపాడాలో అనే అంశంపై హైదరాబాద్ కింగ్ కోఠి కామినేని హాస్పిటల్లో యువ వైద్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. కామినేని, జెమ్ కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నగరంలోని వివిధ హాస్పిటల్స్కు చెందిన వందమంది వైద్యులు పాల్గొన్నారు. ఐసీయూలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్ వైద్యులు ఈ వర్క్ షాప్లో యువ వైద్యులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఐసీయూలో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలో వివరించారు. ఐసీయూలో వైద్యులు ఆందోళనకు గురికాకుండా..సరైన వైద్యం అందిస్తే చాలా క్రిటికల్ కేసుల్లో రోగి ప్రాణాలను కాపాడవచ్చని సీనియర్ వైద్యులు తెలిపారు. ఇలాంటి సెమినార్స్ వల్ల వైద్యులు తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జెమ్ కేర్ గ్రూప్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రవిపాటి , కామినేని డైరెక్టర్ డాక్టర్ ఆదిత్య, కామినేని మెడికల్ కాలేజ్ హెచ్ఓడీ డాక్టర్ సాయి, డాక్టర్ రాకేశ్, డాక్టర్ సాయి, గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.