ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరికీ ‘ఆరోగ్యసేతు’ కంపల్సరీ

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరికీ ‘ఆరోగ్యసేతు’ కంపల్సరీ
  • కేంద్ర హోం శాఖ ఆదేశాలు

న్యూఢిల్లీ: దేశంలోని ఉద్యోగులందరూ ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరిగా ఉపయోగించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ను మరో రెండు వారాల పాటు కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ ఆరోగ్య సేతు యాప్ లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని ఉత్తర్వులిచ్చింది. కరోనా కంటైన్​మెంట్ జోన్లు, రెడ్ జోన్లలో ఉండేవారందరూ యాప్ వాడాలని సూచించింది. వారందరిపై ఇంటెన్సివ్ నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్‌ను చెపట్టేందుకు యాప్ వాడకాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన పర్యవేక్షణ స్థానిక అధికారులు చేపట్టాలంటూ మార్గదర్శకాలు విడుదల చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు యాప్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా దేశంలో ఉన్న ఉద్యోగులందరూ వాడాల్సిందేనంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. “ఆరోగ్యసేతు యాప్ .. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరికీ తప్పనిసరి. ప్రతి ఉద్యోగి ఈ యాప్ ను తప్పనిసరిగా వాడేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల హెడ్​లదే”అని హోం మంత్రిత్వ శాఖ తన ఆదేశంలో స్పష్టం చేసింది.